జమిలి తెచ్చిన తంటా.. ఎమ్మెల్యేలపై బాబు అలెర్ట్ .. !
కానీ వాస్తవానికి జెమిలి ఎన్నికలు ఇప్పుడు ఉండవని 2026 తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.;

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుపై రెండు మూడు సర్వే సంస్థలు సర్వే నిర్వహించాయి, వీటిలో ప్రధానంగా ఎమ్మెల్యేల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. కేవలం ఏడాది కాలంలోనే వైసిపి ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా హద్దులు మీరారని ప్రతి విషయంలోనూ చేతులు తడిపేలా చేసుకున్నారని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. మరి ఇలా ఏడాది కాలంలోనే ఎమ్మెల్యేలు ఎందుకిలా వ్యవహరించారు అనేది కీలకంగా మారింది.
పైగా గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన వారిలో దాదాపు 80 మంది కొత్త వారే కావటం విశేషం. వీరు కూడా అవినీతి బాట పట్టడం వంటివి సాధారణంగా చర్చకు వచ్చే అంశాలు. ఈ విషయాన్ని పరిశీలిస్తే జమిలి ఎన్నికల ప్రకటన వీరిపై ప్రభావం చూపించింది.. అనేది కారణంగా కనిపిస్తోంది. జెమిలి ఎన్నికలు అంటూ కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందట పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా తరమీదకు వచ్చింది దీంతో ఎమ్మెల్యేలు గత 2019, 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత పోగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఏడాది కాలంలోనే పక్కదారి పట్టారన్న వాదన వినిపిస్తోంది. కానీ వాస్తవానికి జెమిలి ఎన్నికలు ఇప్పుడు ఉండవని 2026 తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జెమిలి ఎన్నికలపై ఇప్పటికీ అదే ప్రచారం ఉండటంతో నాయకులు వేరే దారిలో నడుస్తున్నారన్నది ప్రధాన వాదన. ఇదే కారణంతో వారు సొమ్ములు సమకూర్చుకునేందుకు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. ఇప్పట్లో జమిలి ఎన్నికలు లేవు. అయినా.. వారి తీరు మారలేదని అంటున్నారు. దీనిపై టీడీపీ అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు వస్తుండడంతో పార్టీ అధినేత చంద్రబాబు సైతం అలెర్ట్ అయ్యారు. మరి ఇప్పటికైనా మారుతారో లేదో చూడాలి.