అమరావతికి ఆర్బీఐ.. మరో 25 బ్యాంకుల నిర్మాణానికి డేట్ ఫిక్స్
రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు సమాంతరంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు ప్రాజెక్టులు కూడా నిర్మాణాలకు ముందుకొస్తున్నాయి.;
రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు సమాంతరంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు ప్రాజెక్టులు కూడా నిర్మాణాలకు ముందుకొస్తున్నాయి. ఇక తాజాగా జాతీయ బ్యాంకుల శంకుస్థాపనకు ముహూర్తం మళ్లీ ఫిక్స్ చేశారు. గత నెలలోనే ఈ కార్యక్రమం జరగాల్సివుండగా, మొంథా తుఫాన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండటంతో ఈ నెల 28న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంతోపాటు మరో 25 ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామారన్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి పరిధిలోని నేలపాడులో ఆర్బీఐకి కేటాయించిన 3 ఎకరాల స్థలంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. గత నెల 28న ఈ భవన నిర్మాణానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయాల్సివుంది. అప్పట్లో తుఫాన్ ఏర్పడటంతో రద్దు చేశారు. ఇప్పుడు కూడా అదే తేదీన అంటే నవంబరు 28న శంకుస్థాపనకు ముహూర్తం కుదరడం గమనార్హం. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ టూర్ ఖరారు చేస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులను ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి 2.0 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో పనులను పునఃప్రారంభించిన తర్వాత నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గతంలో సగం వరకు నిర్మించి మధ్యలో నిలిచిపోయిన పనులు అన్నీ పూర్తయ్యాయి. సీఆర్డీఏ పరిపాలన భవనం ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు హోటళ్లు, విద్యాసంస్థల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు, గ్రావిటీ కెనాల్స్, డ్రైనేజీల నిర్మాణ పనులు విరామం లేకుండా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో 25 జాతీయ, ప్రైవేటు బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
నిజానికి 2014-19 మధ్య కాలంలోనే 12 జాతీయ బ్యాంకులకు రాజధాని అమరావతిలో భూములు కేటాయించారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద బ్యాంకులు అన్నింటికి పక్కపక్కనే భూములిచ్చారు. చంద్రబాబు 3.0లో భవన నిర్మాణాలకు ముందుకొచ్చిన బ్యాంకులు.. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వెనక్కి తగ్గాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో జాతీయ బ్యాంకులు కూడా భూములను స్వాధీనం చేసుకోలేకపోయాయి.
ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకులతో సంప్రదింపులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవడంతో జాతీయ బ్యాంకుల యాజమాన్యాలు అన్నీ ఒకేసారి శంకుస్థాపనకు నిర్ణయించాయి. అయితే మెంథా తుఫాన్ కారణంగా గత నెలలో ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో బ్యాంకులు అన్నీ ఒకేచోట నిర్మించనుండటం వల్ల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు.
అమరావతిలో నిర్మాణం జరగనున్న బ్యాంకుల్లో ఎస్బీఐకి 3 ఎకరాలు కేటాయించారు. ఇందులో 14 అంతస్థుల్లో ఎస్బీఐ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించనుంది. అదేవిధంగా కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉద్దండరాయుని పాలెంలో ప్రధాన కార్యాలయాలను నిర్మించనున్నాయి.