అమరావతి చకచకా...అప్పటికి రూపూ షేపూ !
అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతోంది.;
అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతోంది. 2014 నుంచి 2019 మధ్యలో నత్త నడకగా సాగిన చర్యలతో 2019 ఎన్నికల తరువాత జగన్ కి అనవసరంగా చాన్స్ ఇచ్చామన్న భావన అయితే టీడీపీలో నిండుగా ఉంది. దాంతో మళ్ళీ అలాంటి పొరపాటు చేయకూడదని కూటమి పవర్ లోకి వచ్చిన తరువాత డే వన్ నుంచి పట్టుదలగానే ఉంది. దాంతో గడచిన 22 నెలల కాలంలో అమరావతిలో నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. గత నెలలో అయితే చట్టబద్ధత కూడా వచ్చింది.
మ్యాప్ లో అమరావతి :
అంతే కాదు భారత దేశ రాజకీయ మ్యాప్ లో అమరావతి పేరు శాశ్వతం అయింది. ఆంధ్రప్రదేశ్ అని ఉన్న చోట అమరావతి రాజధానిగా కేంద్రం ఉంచుతూ మ్యాప్ ని డిజైన్ చేసింది. ఇతర రాష్ట్రాలకు వాటి రాజధానులు ఉన్న మాదిరిగానే ఏపీకి కూడా దర్జాగా అమరావతి పేరు కనిపిస్తోంది. దాంతో కూటమి ప్రభుత్వం ఏమి సాధించింది అంటే ఆంధ్రులకు గర్వం గౌరవం అని అయిదు కోట్ల మంది జనాలు ముక్తకంఠంతో చెబుతారు. ఇక్కడే వైసీపీ ప్లాన్ ఏలూ బీలూ కూడా పటాపంచలు అవుతున్నాయి. మరో వైపు చూస్తే అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణం పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ భవనాలతో పాటు గా సమాంతరంగా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములలో కూడా పనులు మొదలవుతున్నాయి ఆ దిశగా వేగవంతం చేయాలని తరచూ నిర్వహిస్తున్న సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారు. దిశా నిర్దేశం చేస్తున్నారు.
రికార్డు స్థాయి మీటింగ్స్ :
అమరావతి రాజధాని నిర్మాణం పనుల విషయంలో చంద్రబాబు ఎంత గట్టి పట్టుదలతో ఉన్నారో చెప్పడానికి ఆయన నిర్వహించే మీటింగులే ఉదాహరణ అని చెబుతారు. ఆయన తాజాగా ఏకంగా 60 వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. అంటే ఇవన్నీ నిజంగా రికార్డ్ బ్రేక్ మీటింగులే అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ మీటింగులు అన్నీ 2024 తరువాతనే జరిగాయంటే టీడీపీ అమరావతి విషయంలో ఎంతలా ఫోకస్ పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మీటింగ్ లో చంద్రబాబు అమరావతి రాజధాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అమరావతిని ఆకు పచ్చ రాజధానిగా అలాగే నీలి నగరంగా రూపుదిద్దుతున్నామని చెప్పారు. అమరావతి అన్నది అత్యంత లవబుల్ లివబుల్ సిటీ అని బాబు ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలు అన్నీ అమరావతిని ఎంతో ప్రేమించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.
పెట్టుబడుల వరదతో :
అమరావతిలో పెట్టుబడుల వరద పారుతోందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాజాగా బిట్స్ పిలాని లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్ అమరావతిలో నెలకొల్పుతున్నారని చెప్పారు. దీని వల్ల అమరావతికి విద్యాపరంగా సరికొత్త కళ వచ్చింది అని అన్నారు. అంతే కాదు రానున్న కాలంలో విద్యల నగరంగా అమ్రావతి నిలుస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక బిట్స్ పిలానిలో అడ్మిన్షన్లు 2027 నుంచి మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇక అమరావతి రాజధానిని కలుపుకుంటూ కృష్ణానదిపై నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్గా నిర్మించాలని చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో అధికారులకు సూచించారు.
అప్పటికి ఒక రూపు :
మరో మూడేళ్ళు కూటమి ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది. 2029 ఎన్నికల ముందు నాటికి అమరావతిలో అన్ని ప్రభుత్వ భవనాలు సిద్ధం అవుతాయి. అలాగే ప్రైవేట్ సంస్థలలో కొన్నింటిని పూర్తి చేస్తారు. బిట్స్ పిలాని లాంటి విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు మొదలెడతాయి. ఇక బసవతారకం ఆసుపత్రి సేవలు అప్పటికి స్టార్ట్ అవుతాయి. అలాగే అనేక జాతీయ బ్యాంకుల కార్యకలాపాలు కూడా ప్రారంభం అయి ఆర్థిక రాజధానిగా అమరావతి నిలుస్తుంది అని అంటున్నారు. ఇవన్నీ ఆ ఎన్నికల్లో అమరావతి గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తే మరో సారి కూటమి ప్రభుత్వం విజయం తధ్యమని భావిస్తున్నారు. ఇక జగన్ ప్లాన్ ఏ విశాఖ ప్లాన్ బీ మావిగాన్ అంటూ చేతున్న ప్రకటనలు అన్నీ పూర్వ పక్షంగానే మిగిలిపోతాయని ప్లాన్ సీ ప్లాన్ డీని కూడా వైసీపీ వెతుక్కునేలోగానే అమరావతి ప్రగతిపధంలో దూసుకుని పోతుందని టీడీపీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.