టాప్ స్టోరీ:టైర్ 2 హీరోల్లో బోర్డర్ దాటేసింది వీరే!
ఒక్కటంటే ఒక్క సినిమా అయినా పడుతుందా? దాంతో ఆ బోర్డర్ని దాటేయలేకపోతామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;
పాన్ ఇండియా సినిమాల ప్రభావం మొదలైన దగ్గరి నుంచి టాలీవుడ్ హీరోల్లో అత్యధిక శాతం మందిని ఓ ప్రశ్న వెంటాడుతోంది. అదే వంద కోట్ల క్లబ్లో చేరే సినిమా ఎప్పుడని. చిన్న చిన్న హీరోలు సైతం తమ సినిమాలతో వంద కోట్ల మార్కుని దాటేస్తుంటే వారి కంటే ముందు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన హీరోలు ఆ మార్కుని..ఆ బోర్డర్ని దాటేయలేకపోతున్నారు. ఒక్కటంటే ఒక్క సినిమా అయినా పడుతుందా? దాంతో ఆ బోర్డర్ని దాటేయలేకపోతామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ బోర్డర్ని ముందు దాటేసిన హీరో...
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కు బోర్డర్ని చాలా సింపుల్గా దాటేసి దానికి మించిన వసూళ్లని రాబోయే సినిమాలతో సాధించాలని కొంత మంది హీరోలు ఆశగా అడుగులు వేస్తున్నారు. టైర్ 2 హీరోల్లో ఈ బోర్డర్ని ముందు దాటేసిన హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. పరశురామ్ డైరెక్ట్ చేసిన `గీత గోవిందం` సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.132 కోట్లు వసూలు చేసి ఫస్ట్ టైమ్ రౌడీ సత్తా ఏంటో చూపించింది.
అప్పటి నుంచి మళ్లీ వంద కోట్లు రాబట్టే సినిమా కోసం శ్రమిస్తున్నా విజయ్కి వర్కవుట్ కావడం లేదు. ఆ తరువాత రేసులో నిలిచింది మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ `ఉప్పెన`. బుచ్చిబాబు సాన డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో వంద కోట్ల మార్కుని చేరింది. దానికి మించి వైష్ణవ్ తేజ్ ట్రై చేస్తున్నా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. తన తరువాత మూడు సినిమాలతో రేసులో ముందు వరుసలో నిలిచిన హీరో నేచురల్ స్టార్ నాని. `దసరా` మూవీతో ఫస్ట్ టైమ్ వంద కోట్ల క్లబ్లో చేరిన నాని ఆ తరువాత `సరిపోదా శనివారం, హిట్ 3లతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన హీరో అనిపించుకున్నాడు.
ఈ రేసులో నిఖిల్ కూడా చేరాడు. తను నటించిన మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ `కార్తికేయ 2`తో ఈ ఫీట్ని అందుకున్నాడు. ఈ మూవీ రూ.120 కోట్లకు పైనే రాబట్టింది. మాస్ మహారాజా రవితేజ కూడా `ధమాకా` మూవీతో ఈ క్లబ్లో చేరాడు. యాక్షన్ కామెడీ డ్రామాగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీ రూ.110 కోట్లు రాబట్టింది. స్టార్బాయ్ సిద్దూ జొన్నలగడ్డ `టిల్లూ స్క్వేర్`తో ఆ ఫీట్ని పూర్తి చేశాడు. త సినిమా రూ. 135 కోట్ల వసూళ్లని అందించింది. నాగచైతన్య కూడా నేను సైతం అన్నట్టుగా `తండేల్`తో రూ.100 కోట్లు రాబట్టి ఈ క్లబ్లో స్థానం దక్కించుకున్నాడు.
రేసులో లేని హీరో ఖాతాలో రెండు...
చైల్డ్ ఆర్టిస్ట్గా సినీరంగంలో ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జ `ఓ బేబీ` సినిమాతో యంగ్ యాక్టర్గా అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత టైటిల్ పాత్రలో నటించిన ఈ మూవీ సక్సెస్ కావడంతో `జాంబిరెడ్డి`తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఇష్క్, అద్భుతం అంటూ రెండు సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రశాంత్ వర్మతో కలిసి `హనుమాన్` అంటూ షాక్ ఇచ్చాడు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుని బాక్సాఫీస్ వద్ద రూ.296 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ అందించిన జోష్తో కొత్త కథలనే ఎంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన తేజ `మిరాయ్` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది కూడా సక్సెస్ అయి రూ.140 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన హీరోగా సరికొత్త రికార్డు సాధించాడు. త్వరలో `జై హనుమాన్`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వంద కోట్లు దాటని హీరోలు...
మాస్ మహారాజా రవితేజ నుంచి తేజ సజ్జ వరకు టైర్ 2 హీరోల్లో చాలా వరకు వంద కోట్ల బోర్డర్ని దాటేయడంతో ఇప్పుడు మిగిలిన హీరోలపై చర్చ మొదలైంది. ఈ మార్కుని ఇప్పటి వరకు రామ్ పోతినేని, శర్వానంద్, గోపీచంద్, అల్లరి నరేష్, రానా దగ్గుబాటి (సోలో హీరోగా), అడివి శేష్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాయి ధరమ్తేజ్, వంటి హీరోలున్నాయి. ఈ ఫీట్ని సాయి ధరమ్ తేజ్ `విరూపాక్ష` మూవీతో దాటేస్తాడని అనుకున్నారు కానీ ఆ మూవీ రూ.90 కోట్లు మాత్రమే రాబట్టడంతో తను వంద కోట్ల క్లబ్లో చేరలేకపోయాడు. మిగిలిన టైర్ 2 హీరోల్లో రామ్ నుంచి రానా వరకు అవకాశం ఉన్న అందుకు తగ్గ సినిమాలు పడటం లేదు. వన్స్ పడితే వంద బోర్డర్ ఈజీగా దాటేస్తారు.