'ఛావా' మేకర్స్ హీరోయిన్ ఓరియంటెడ్
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే;
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా గా ఛావా నిలిచింది. చత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'ఛావా' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ సూపర్ హిట్గా నిలిచింది. విక్కీ కౌశల్ కెరీర్లోనే కాకుండా ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో అతి పెద్ద హిట్గా ఛావా నిలిచింది. ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మించిన విషయం తెల్సిందే. ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సినిమా నిర్మాణం అనేది సాహసం.
శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై నమ్మకంతో చత్రపతి శివాజీ మహారాజ్ పై అభిమానంతో దినేష్ విజన్ సినిమాను నిర్మించారు. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను విభిన్నంగా రూపొందించారు. ఒక ఛారిత్రాత్మక సినిమాగా కాకుండా మంచి కమర్షియల్ సినిమాగా శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం లో సక్సెస్ అయ్యారు. అందుకే ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఛావా సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి సినిమా ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు లక్ష్మణ్ ఉటేకర్ కొత్త సినిమా పనులు మొదలు పెట్టారు.
బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి సినిమాకు కూడా దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈసారి భారీ బడ్జెట్తో దినేష్ విజన్ నిర్మించేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఒక ప్రముఖ మరాఠీ నవల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ సినిమాను రూపొందించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే ఆ నవల రైట్స్ను భారీ మొత్తానికి నిర్మాత దినేష్ విజన్ దక్కించుకున్నారని తెలుస్తోంది. హిందీలో రూపొందబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రద్దా కపూర్ను నటింపజేసేందుకు గాను చర్చలు జరిగాయి. ఛావా సినిమా ఫలితం నేపథ్యంలో శ్రద్దా కపూర్ వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు కథ, కాన్సెప్ట్ విషయంలో క్లారిటీ రాలేదు. కానీ మొదట హీరోయిన్ను ఎంపిక చేయడంతో సినిమా లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనే విషయం క్లారిటీ వచ్చింది. మహారాష్ట్రకు చెందిన వీర వనిత పాత్రలో శ్రద్దా కపూర్ కనిపించబోతుందని తెలుస్తోంది. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న శ్రద్దా కపూర్ ఈ భారీ చారిత్రాత్మక సినిమాలో నటించడం ద్వారా దేశ వ్యాప్తంగా సినిమాకు మంచి స్పందన వచ్చే అకవాశాలు ఉన్నాయి. ఛావా సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఏడాదిలో సినిమా పట్టాలెక్కబోతుంది.
ప్రస్తుతం శ్రద్దా కపూర్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత లక్ష్మణ్ ఉటేకర్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నటిగా ఇప్పటికే శ్రద్దా కపూర్ పలు సినిమాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే ఈ సినిమా కోసం ఆమెను ఎంపిక చేసి ఉంటారని తెలుస్తోంది.