ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చ‌ర‌ణ్ మాట‌

Update: 2020-09-20 10:30 GMT
గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఎలా ఉంది? ఆయ‌న కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా? ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌కు ఇలా ఎన్నో సందేహాలు. వాట‌న్నిటికీ స‌మాధాన‌మిచ్చారు ఆయ‌న వార‌సుడు ఎస్పీ చరణ్. తన తండ్రి కోలుకుంటున్నారని అయితే ఇంకా ఎక్మో  వెంటిలేటర్ సాయం అందుతూనే ఉంద‌ని తెలిపారు.

ఎస్పీ చ‌ర‌ణ్‌ తన ఫేస్ బుక్ పేజీలో త‌న తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడిన‌ వీడియోను రిలీజ్ చేశారు. నాన్న‌గారు నెమ్మదిగా కోలుకుంటున్నార‌ని.. నిన్నటి నుండి ఘనాహారాన్ని తీసుకుంటున్నార‌ని తెలిపారు.  సుమారు 15-20 నిమిషాలు కూర్చోగలరు. ఇత‌ర వ్యాధులు లేనప్పటికీ అతని ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడాలి కాబట్టి ఎక్మో అండ్ వెంటిలేటర్ మద్దతు ఇంకా కొనసాగుతోంది. తన తండ్రి త్వరలోనే కోలుకునేలా ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని చరణ్ చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితులను అప్ డేట్ చేయడంతో పాటు తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించినందుకు  అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ 74 ఏళ్ల ఏస్ సింగర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యాక ఆగ‌స్టు 5న‌ ఆసుపత్రిలో చేరారు. దగ్గు.. జలుబు వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ వ‌య‌సు దృష్ట్యా.. చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు. కానీ అకస్మాత్తుగా అతని ఆరోగ్యం ఆగస్టు 13 నాటికి బాగా క్షీణించింది. వెంటనే అతన్ని ఐసియుకు మార్చారు. వెంటిలేటర్ అలాగే ఇసిఎంఓలో ఉంచారు. ECMO అంటే... ఈ యంత్రం కార్బన్ డయాక్సైడ్ ను తొలగించి ఆక్సిజన్ నిండిన రక్తాన్ని కణజాలాలకు తిరిగి ఇచ్చే గుండె- ఊపిరితిత్తుల యంత్రానికి రక్తాన్ని పంపుతుందన్న‌ది తెలిసిందే.
Tags:    

Similar News