యాంగ్రీ డాటర్ డెబ్యు మూవీ మొదలెట్టారు

Update: 2018-03-24 08:07 GMT
మూడు దశాబ్దాల క్రితం అంకుశం సినిమా ద్వారా యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న రాజశేఖర్ కూతురు శివాని హీరొయిన్ గా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభమయ్యింది. అడవి శేష్ హీరోగా నటించే ఈ మూవీ హిందిలో సూపర్ హిట్ అయిన 2 స్టేట్స్ కి రీమేక్. అర్జున్ కపూర్ - ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా ఆ సంవత్సరం వచ్చిన టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. వెంకట్ కుంచ దర్శకుడిగా లాంచ్ అవుతున్న ఈ మూవీలో మైనే ప్యార్ కియా ఫేం భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైన షూటింగ్ కి రాజమౌళి అతిధిగా వచ్చి క్లాప్ కొట్టగా కృష్ణం రాజు సతీసమేతంగా వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. లక్ష్య బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీకి క్షణం ఫేం శానియేల్ డియో కెమెరా అందించనున్నాడు.

రాజశేఖర్ తన కూతురిని హీరొయిన్ గా పరిచయం చేయటం గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి కాని తమిళ్ సినిమా ద్వారా చేస్తారనే టాక్ బలంగా విన్పించింది. దాన్ని కొట్టిపారేస్తూ తెలుగు సినిమా ద్వారా డెబ్యు చేయించడం ఫాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ప్రేమ జంట జరిగే సున్నితమైన భావోద్వేగాలే 2 స్టేట్స్ స్టొరీ. ఒరిజినల్ ఫ్లేవర్ చెడిపోకుండా నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేసినట్టు సమాచారం. శివాని హీరొయిన్ గా నటించే మొదటి సినిమా కాబట్టి అభిమానుల్లో సహజంగానే ఆసక్తి రేగుతోంది.

స్టార్ హీరోల కూతుళ్ళు సినిమాల్లోకి రావడం కొత్తేమి కాదు. కృష్ణ గారి అమ్మాయి మంజుల నటిగా ఎక్కువ సినిమాలు చేయలేక ఈ ఏడాది దర్శకురాలిగా మారారు. నాగబాబు కూతురు నీహారిక తెలుగు - తమిళ్ డెబ్యు మూవీస్ రెండు ఫలితాన్ని ఇవ్వలేదు. కోలీవుడ్ లో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి - కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఇప్పటికే స్టార్ హీరొయిన్ల దాకా ఎదిగారు. మరి శివాని కూడా అదే దారిలో పయనించాలని జీవిత రాజశేఖర్ దంపతుల లక్ష్యం. షూటింగ్ త్వరగా పూర్తి చేసి దసరా లోపు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.
Tags:    

Similar News