క‌న్న‌డిగులు మ‌న శత్రువులు కాదు: శింబు

Update: 2018-04-12 16:54 GMT
కావేరీ వాట‌ర్ బోర్డు ఏర్పాటు చేయడం పై కేంద్ర‌వైఖ‌రికి నిర‌స‌న‌గా త‌మిళ‌నాడులో తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. కావేరీ జ‌ల‌వివాదం పై త‌మిళ‌నాడు అట్టుడికిపోతోంది. నేడు త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోదీకి కూడా నిర‌స‌న సెగ త‌గిలింది. చెన్నైలో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ కు కూడా ఆ సెగ త‌గ‌ల‌డంతో త‌ర్వాతి మ్యాచ్ ల‌ను పుణెకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌కు, త‌మిళ‌నాడుకు మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా క‌ర్ణాట‌క‌పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో శింబు...క‌ర్ణాట‌క‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డం ప‌లువురికి షాక్ ఇచ్చింది. కన్నడ ప్ర‌జ‌లు త‌మిళ ప్ర‌జ‌ల‌కు శత్రువులు కారని.. ఇరు ప్రాంత ప్ర‌జ‌ల‌కు  మంచి జరగాలని.....ఇరు ప్రాంతాల‌కూ న్యాయ బ‌ద్ధంగా కావేరీ జలాల పంపిణీ జ‌ర‌గాల‌ని శింబు అభిప్రాయపడ్డారు.

ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య గొడ‌వ‌లు పెంచేలా రాజ‌కీయ నాయ‌కులు వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని, క‌న్న‌డ ప్ర‌జ‌ల‌తో ప్రేమ‌గా సామ‌ర‌స్య‌పూర‌కంగా ఉండి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని పిలుపునిచ్చాడు. అనూహ్యంగా కన్నడ ప్ర‌జ‌ల‌కు శింబు మద్దతు తెల‌ప‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కన్నడ ప్ర‌జ‌ల‌తో పాటు త‌మిళ ప్ర‌జ‌లు కూడా శింబు ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నారు. ప్ర‌ముఖ నటుడు అనంత్ నాగ్ తో పాటు పలువురు సెల‌బ్రిటీలు శింబుపై ప్రశంసలు కురిపించారు. శింబు చాలా పరిణతితో వ్యాఖ్యానించాడ‌ని, సున్నిత‌మైన అంశంపై రెచ్చ‌గొట్టేలా కాకుండా స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా వ్యాఖ్యానించాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. త‌న‌ను మెచ్చుకుంటున్న వారంద‌రికీ ధన్యవాదాలు చెబుతూ శింబు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు. నిత్యం త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్యాల‌తో వార్త‌ల్లో ఉండే శింబు ఈ త‌ర‌హాలో వ్యాఖ్యానించ‌డం పలువురిని విస్మయానికి గురిచేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే, తమిళ‌, క‌న్న‌డ హీరోలంతా శింబును ఆద‌ర్శంగా తీసుకొని స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తే బాగుంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News