శింబు-నయన్ ఫొటోలెలా లీకయ్యాయి?

Update: 2018-08-16 10:23 GMT
పదేళ్ల కిందట తమిళ కథనాయకుడు శింబుతో నయనతార ఎఫైర్ ఎంతటి చర్చనీయాంశమైందో తెలిసిందే. ‘వల్లభ’ సినిమా చిత్రీకరణ సందర్భంగా శింబుతో ప్రేమలో పడ్డ నయన్.. అతడితో కొంత కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఐతే పెళ్లి వైపు వెళ్తారనుకున్న వీళ్లిద్దరూ ఉన్నట్లుండి విడిపోయారు. అదే సమయంలో శింబుతో నయన్ చాలా క్లోజ్‌ గా ఫొటోలు - వీడియోలు బయటికి రావడం సంచలనం రేపింది. తనను వదిలేసి వెళ్లిపోయిన నయనతారను ఇబ్బంది పెట్టడం కోసం శింబు కావాలనే ఈ ఫొటోలు లీక్ చేశాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కొంత కాలానికి అందరూ ఈ వివాదాన్ని మరిచిపోయారు. నయన్ ఆ తర్వాత ప్రభుదేవా ప్రేమలో పడింది. అతడితోనూ బ్రేకప్ అయ్యాక ఇప్పుడు విఘ్నేష్ శివన్‌ తో రిలేషన్ షిప్‌ లో ఉంది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలుస్తున్నాయి.

ఐతే ఎప్పుడో ముగిసిపోయిన వివాదం గురించి శింబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నయన్‌ తనతో ఉన్న ఫొటోలు తాను లీక్ చేయలేదన్నాడు. ఆ ఫొటోలు నిజమైనవే అని.. మార్ఫింగ్ చేసినవి కావని.. తామిద్దరం దుబాయ్ వెళ్లినపుడు ఆ ఫొటోలు దిగామని చెప్పాడు. తాము అక్కడ ఒక కొత్త కెమెరా కొన్నామని.. దాంతోనే ఫొటోలు తీసుకున్నామని.. ఐతే ఆ కెమెరా అనుకోకుండా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లడంతో ఫొటోలు లీకయ్యాయని.. అంతే తప్ప తాను వాటిని ఉద్దేశపూర్వకంగా లీక్ చేయలేదని శింబు చెప్పాడు. దాని వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయన్న శింబు.. తాను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదని.. అనుమతి లేకుండా ఏ అమ్మాయి మీదా చేయి వేయలేదని చెప్పడం విశేషం. నయన్‌ నుంచి విడిపోయాక కొన్నాళ్ల పాటు హన్సికతో ప్రేమలో ఉన్న శింబు.. తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమెకు కూడా దూరమైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News