అప్పుడే షూటింగ్ పూర్తి చేశారు.. టీజర్ కూడా రెడీ చేస్తున్నారు..!

Update: 2021-07-13 16:30 GMT
తమిళ స్టార్ హీరోలైన విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ'' ‘నోటా’ ఫేమ్ ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్‌ హీరోగా నటిస్తున్న 30వ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి హీరోయిన్‌ గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఎనిమీ’ మూవీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్ అయినట్లు హీరో విశాల్ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

''#ఎనిమీ షూటింగ్ పూర్తి చేశాం. త్వరలో టీజర్‌ విడుదలకు అంతా సిద్ధమవుతోంది. ఇలాంటి లవ్లీ టీమ్‌ తో వర్క్‌ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ లవ్ లో ప్రాజెక్ట్‌ లో భాగమైన ఆనంద్‌ శంకర్ - థమన్ - ఆర్‌డి రాజశేఖర్ - నిర్మాత వినోద్‌ కుమార్‌ మరియు మిగతా నటీనటులు సిబ్బందికి నా ధన్యవాదలు. ఫ్యాబులస్ మూవీలో ఆర్యతో కలిసి మళ్లీ వర్క్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది'' అని విశాల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, 'ఎనిమీ' చిత్రంలో విశాల్ హీరోగా నటించగా.. ఆర్య విలన్ గా కనిపించనున్నాడని సమాచారం. బాలా దర్శకత్వంలో 'వాడు వీడు' సినిమాలో కలిసి నటించిన విశాల్ - ఆర్య..  పదేళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ దుబాయ్ లో జరిపారు. ఇందులో ఓ యాక్షన్ సీన్ కోసం విశాల్ ఏకంగా 50 అడుగుల ఎత్తు ఉన్న బిల్డింగ్ పై నుంచి ఎలాంటి స‌పోర్ట్ సిస్టిమ్ లేకుండా కింద ఉన్న స్పాంజ్ బెడ్ మీద‌కి జంప్ చేయడం విశేషం.

'ఎనిమీ' చిత్రాన్ని మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్‌ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశాల్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాని కూడా తెలుగు తమిళంతో పాటుగా మరికొన్ని ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. షూటింగ్ కంప్లీట్ అవడంతో వీలైనంత త్వరగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరిపి రిలీజ్ కు రెడీ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News