రాజమౌళి ఆ రచయితను ఎందుకు వదిలేశాడు?

Update: 2017-01-22 06:39 GMT
రాజమౌళి లాంటి దర్శకుడు.. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీలో పని చేసే అవకాశం ఇస్తే ఎవరైనా వదులుకుంటారా? ఐతే కృష్ణవందే జగద్గురుం.. కంచె.. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో రచయితగా గొప్ప పేరు సంపాదించిన సాయిమాధవ్ బుర్రా ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడట. ఈ విషయంలో తన తప్పిదం కూడా కొంత ఉన్నప్పటికీ.. రాజమౌళి తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఒకింత నిరాశ వ్యక్తం చేశాడు సాయిమాధవ్. ఇంతకీ ఈ వ్యవహారంలో మలుపులేంటో సాయిమాధవ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘కృష్ణం వందే జగద్గురుం సినిమాకు మాటలు రాశాక నాకు ‘బాహుబలి’కి పని చేసే అవకాశం దక్కింది. రాజమౌళి గారు పిలిస్తే వెళ్లాను. సినిమాకు మాటలు రాయమన్నారు కానీ.. నాతో పాటు ఇంకో రచయిత కూడా ఈ సినిమాకు పని చేస్తున్నట్లు చెప్పారు. ఐతే నా కెరీర్ అప్పుడే మొదలైన నేపథ్యంలో ఇంకో రచయితతో కలిసి పనిని పంచుకోవడంపై సంశయం వ్యక్తం చేశాను. ఏ డైలాగ్ ఎవరు రాశారనే సందిగ్ధత వస్తుందని.. నా కెరీర్ కు ఇది అంత ప్లస్ కాకపోవచ్చని చెప్పాను. నేను ఒక్కడినే రాస్తానని.. నచ్చకపోతే తీసేయమని అన్నాను. దీంతో మూడు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి.. మీరొక్కరే రాద్దురు కానీ రమ్మన్నారు. వెళ్లాం. సిట్టింగ్స్ అయ్యాయి. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పారు. నేను వచ్చేశాను. కానీ తర్వాత రాజమౌళి గారి నుంచి ఫోన్ రాలేదు. నేను కూడా సైలెంటైపోయాను. ఈ విషయంలో ఏం జరిగిందో తెలియదు. బాహుబలి లాంటి సినిమాకు పని చేయడం అంటే అదృష్టమే. కానీ ఈ విషయంలో రాజమౌళి గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన గొప్ప వ్యక్తి’’ అని సాయిమాధవ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News