'పుష్ప' రీ షెడ్యూల్‌.. రిలీజ్ పై హోప్స్‌

Update: 2021-06-19 04:30 GMT
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప షూటింగ్ కరోనా సెకండ్‌ వేవ్‌ తో నిలిచి పోయింది. చాలా సినిమాలు షూటింగ్ ఆగిన సమయంలో కూడా కరోనాను ఎదుర్కొని మరీ పుష్ప సినిమా షూటింగ్‌ ను కొనసాగించారు. పరిస్థితులు మరింతగా విషమంగా మారడంతో పుష్ప షూటింగ్ ను నిలిపి వేశారు. షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యిందని.. మూడు నాలుగు వారాలు షెడ్యూల్‌ మాత్రమే బ్యాలన్స్ ఉందని సమాచారం. సినిమా ను ఆగస్టులో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాని షూటింగ్‌ నిలిచి పోవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని మళ్లీ పుష్ప రిలీజ్‌ పై అభిమానులు హోప్స్‌ పెంచుకునే వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జులై 5 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుందట. అల్లు అర్జున్‌.. రష్మిక మందన్నా మరియు ఫాహద్‌ లు జులై మొదటి వారంలో షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యేందుకు డేట్లు కూడా ఇచ్చేశారని సుకుమార్‌ టీమ్ అనధికారికంగా చెబుతున్నారు. పుష్ప సినిమా షూటింగ్‌ రీ షెడ్యూల్‌ కన్ఫర్మ్‌ అయ్యింది కనుక విడుదల తేదీ విషయంలో అనుమానాలు ఉండక పోవచ్చు అంటున్నారు. థియేటర్లు జులై నెలలో కనీసం  50 శాతం ఆక్యుపెన్సీతో అయినా రన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో థియేటర్లు కూడా ఓపెన్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఆగస్టులో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయ్యి జనాలు థియేటర్ల ముందు క్యూ కడితే ఖచ్చితంగా అనుకున్న తేదీకే పుష్ప ను తీసుకు వస్తారనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పుష్ప సినిమా రెండు పార్ట్‌ లు అనడంతో పాటు.. బుచ్చి బాబు పది కేజీఎఫ్‌ లతో సమానం అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే ఆగస్టులోనే సినిమా ను విడుదల చేయాలని బన్నీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సుకుమార్‌ కూడా అదే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
Tags:    

Similar News