ఫుల్‌ క్లారిటీ: ఒకే వేదికపై మెగా బ్రదర్స్‌

Update: 2015-06-29 07:44 GMT
మెగా బ్రదర్స్‌ చిరంజీవి-పవన్‌కల్యాణ్‌ మధ్య విభేధాలు తారాస్థాయిలో ఉన్నాయి అనేది అందరూ నమ్ముతున్న విషయం. అన్నదమ్ముల మధ్య గొడవలు రచ్చకెక్కాయని అప్పట్లో ప్రచారమైంది. అసలు మెగా వేడుకల్లో పవన్‌ కనిపించకపోవడానికి కారణం మనస్ఫర్థలే అంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. చిరు-నాగబాబు, చిరు- పవన్‌ మధ్య మనస్ఫర్థలు అంటూ బోలెడన్ని ఎపిసోడ్లు బుల్లితెరపై సందడి చేశాయి. అయితే వేటినీ ఈ బ్రదర్స్‌ పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదండోయ్‌.. అవన్నీ వట్టి పుకార్లే అని నిరూపించడానికి ఇన్నాళ్టికి ఒక వేదికను కూడా సిద్దం చేస్తున్నారు బ్రదర్స్‌.

ఆగస్టు 22న గచ్చిబౌళి ఇండోర్‌ స్టేడియంలో చిరు పుట్టినరోజు వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారక్కడ. ఈ వేడుకలకు మెగాభిమానులు భారీగా తరళి వస్తున్నారని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు తెలిపారు. నెల్లూరులో ఇటీవలే జరిగిన చిరంజీవి యువత కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఈ వేడుకలకు పవన్‌కల్యాణ్‌ కూడా వస్తున్నారని నాగబాబు స్వయంగా వెల్లడించారు. చిరంజీవి 150వ సినిమా టైటిల్‌ ఆటోజానీ కాదు.. అది చిరు అభిమానులు సృష్టించినది మాత్రమేనని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు. ఏదేమైనా ఒకే వేదికపైకి మెగా బ్రదర్స్‌ ముగ్గురూ వస్తున్నారు. అభిమానులు, జనాల్లో ఉన్న సందేహాలన్నిటికీ  చెక్‌ పెట్టేయబోతున్నారు. అదీ సంగతి.

Tags:    

Similar News