'బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌' పై కొనసాగుతున్న రచ్చ

Update: 2020-10-06 05:00 GMT
దేశంలో అతి పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించిన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ : ఇండియా వెబ్‌ సిరీస్‌ వివాదాస్పదం అయ్యింది. విజయ్‌ మాల్యా.. నీరవ్‌ మోడీ.. రామలింగ రాజు.. సుబ్రతా రాయ్‌ మరియ మెహల్‌ చోక్సి ల ఆర్థిక నేరాలు మరియు వారు ప్రభుత్వంను మోసం చేసిన విధానంను వెబ్‌ సిరీస్‌ గా రూపొందించారు. ఈ వెబ్‌ సిరీస్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌ పై హైదరాబాద్‌ సివిల్‌ కోర్టులో రామలింగరాజు ఫిర్యాదు చేయడం జరిగింది.

తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ వెబ్‌ సిరీస్‌ ను నిలిపేయాలంటూ కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నుండి వివాదం ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే లేదా మరేంటో కాని బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ : ఇండియా వెబ్‌ సిరీస్‌ నుండి మూడవ ఎపిసోడ్‌ ను తొలగించి స్ట్రీమింగ్‌ చేశారు. అందులో రామలింగరాజుకు సంబంధించిన సన్నివేశాలు ఉండి ఉంటాయని అంతా భావిస్తున్నారు. కోర్టుకు భయపడి నెట్‌ ఫ్లిక్స్‌ వారు ఆ ఎపిసోడ్‌ ను తొలగించారా లేదంటే మరేదైనా కారణంగా అనే విషయమై ఇప్పటి వరకు నెట్‌ ఫ్లిక్స్‌ వారు స్పందించలేదు.

ఈ వెబ్‌ సిరీస్‌ పై సహార గ్రూప్‌ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. మీడియా స్వేచ్చ పేరుతో కొందరు చేస్తున్న పనులు ప్రముఖుల ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉంది. వెబ్‌ సిరీస్‌ ను ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉందంటూ పేర్కొన్నారు. ఇప్పటికే స్ట్రీమింగ్‌ సంస్థ అయిన నెట్‌ ఫ్లిక్స్‌ మరియు వెబ్‌ సిరీస్‌ మేకర్స్‌ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులపై క్రిమినల్‌ కేసులు పెట్టినట్లుగా సహార గ్రూప్‌ ప్రకటించింది. ఈ వెబ్‌ సిరీస్‌ పై విజయ్‌ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా స్పందించాడు. ఈ ప్రభుత్వం తన తండ్రిని బలిపశువును చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News