ఆ నిర్మాత బతికే ఉన్నాడట..

Update: 2016-07-28 15:34 GMT
ఆ మధ్య తమిళనాట ఓ ప్రముఖ నిర్మాత.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఇంట్లో ఓ లేఖ రాసి పెట్టి కాశీకి వెళ్లిపోవడం గుర్తుండే ఉంటుంది. ఆ నిర్మాత పేరు మదన్. ‘వేందార్ మూవీస్’ బేనర్ మీద ఆరవన్ (తెలుగులో ఏకవీర).. లింగా.. పాండియనాడు (పల్నాడు).. పాయుంపులి (జయసింహా) లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు తమిళంలో స్వయంగా కొన్ని సినిమాల్ని కూడా నిర్మించాడు ఈ మదన్. అతను లేఖ రాసి పెట్టి వెళ్లిపోయి రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా అతనేమయ్యాడో తెలియదు.

మదన్ ఆచూకీ కనిపెట్టడం కోసం తమిళనాడు పోలీసులు ఓ స్పెషల్ టీంనే ఏర్పాటు చేశారు. ఆ టీం కాశీకి వెళ్లి ఎంతో శోధించినా మదన్ సంగతేంటో బయటికి రాలేదు. మదన్ వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. తాజాగా మదన్ బతికే ఉన్నాడని.. అతను చనిపోలేదని.. ఇంకొన్ని రోజుల్లోనే అతణ్ని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతామని తమిళనాడు పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఐతే మదన్ ఎక్కడున్నది మాత్రం చెప్పలేదు. ఈ వ్యవహారంలో ఏదైనా గూడుపుఠానీ ఉందేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మదన్ ఆధ్వర్యంలోని వేందార్ మూవీస్.. ఎస్ ఆర్ ఎం గ్రూప్ లో భాగం. ఆ గ్రూప్ అధినేత అయిన పారి వేందార్ ఆరు నెలలుగా మదన్ తో మాట్లాడట్లేదట. ఆయన కుటుంబ సభ్యులు తనను ఓ ద్రోహిలాగా చూస్తున్నారని.. పారి వేందార్ ఆస్తులన్నింటినీ తనకు రాసిచ్చేయబోతున్నాడని అనుమానిస్తున్నారని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మదన్ సుసైడ్ నోట్లో రాశాడు. ఈ లేఖ చదవగానే మదన్ కుటుంబ సభ్యులు కూడా కాశీకి వెళ్లి అతడి కోసం వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న మొట్ట శివ కెట్ట శివ (పటాస్ రీమేక్)కు కూడా మదనే నిర్మాత. మదన్ సంగతేంటో తేలకపోవడంతో రెండు నెలల కిందటే ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటికీ.. ఈ సినిమా విడుదలకు మోక్షం లభించట్లేదు.
Tags:    

Similar News