'సర్కారువారి పాట' .. సక్సెస్ మహేశ్ బాట

Update: 2020-12-25 07:43 GMT
మహేశ్ బాబు .. హ్యాండ్సమ్ అనే పదానికి అర్థం చెప్పిన హీరో. సక్సెస్ కీ .. సంచలనానికి నిర్వచనంగా నిలిచిన హీరో. కథ విషయంలో మహేశ్ బాబును ఒప్పించడం అంత తేలికన విషయమేం కాదు. తన నుంచి ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు కథలో ఉండేలా ఆయన జాగ్రత్త పడుతుంటాడు. తన స్టార్ డమ్ కి తగిన ప్రాజెక్టును సెట్ చేసుకుని కానీ ఆయన రంగంలోకి దిగడు. ఇక కొత్తగా ఆలోచిస్తారు ... కొత్తగా చూపిస్తారనే యువ దర్శకులకు కూడా మహేశ్ ఇటీవల కాలంలో అవకాశాలు ఇస్తూ వెళుతున్నాడు. అలా ఆయన అనిల్ రావిపూడికి ఇచ్చిన అవకాశం వృథా కాలేదు.

అప్పుడప్పుడే పుంజుకుంటున్న యువ దర్శకులకు అవకాశం ఇచ్చే విషయంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావించిన మహేశ్ బాబు, పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందనుంది. బడా నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ కూడా ఒక భాగస్వామి కావడం విశేషం .. అది ఈ కథపై ఆయనకున్న నమ్మకం. కీర్తి సురేశ్ ఆయన జోడీగా కనువిందు చేయనుంది. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. వినోదం ఎంత మాత్రం తగ్గకుండా ఈ కథను పరశురామ్ అల్లినట్టుగా చెబుతున్నారు.

మహేశ్ బాబు వరుసగా మూడేళ్ల నుంచి భారీ విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. 'భరత్ అను నేను' .. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ఒకదానికి మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను సృష్టించాయి. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలుగా నిలబడ్డాయి. విభిన్నమైన జోనర్లలో వచ్చిన ఆ సినిమాలు ఆయన అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. దాంతో ఆ తరువాత రానున్న సినిమా అంతకుమించి అన్నట్టుగా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. మహేశ్ బాబు కూడా తన దూకుడు ఎంతమాత్రం తగ్గకుండా కేర్ తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాదిలో రానున్న 'సర్కారువారి పాట' కూడా, మహేశ్ ను సక్సెస్ బాటలోనడిపించడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది మరి.
Tags:    

Similar News