వర్మను కలవాలని క్రిష్ వెళ్తే..

Update: 2017-01-18 10:28 GMT
గత కొన్ని రోజులుగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో డైరెక్టర్ క్రిష్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఇప్పుడు తనను అంతగా పొగిడేస్తున్న వర్మను చూసి ఒకప్పుడు చాలా ఇన్ స్పైర్ అయిపోయానని అంటున్నాడు క్రిష్. ఆయన దగ్గర పని చేయాలని గట్టి ప్రయత్నమే చేసినట్లు క్రిష్ వెల్లడించాడు. ఐతే జేడీ చక్రవర్తి కారణంగా తాను వర్మను కలవలేకపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పాడు క్రిష్. ఆ కథాకమామిషు ఏంటో క్రిష్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను సినిమా ప్రయత్నాలు చేసిన తొలి నాళ్లలో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పని చేయాలన్న కోరికతో ముంబయికి వెళ్లాను. ఐతే జేడీ చక్రవర్తి నాకు అడ్డం పడ్డాడు. అప్పటికి వర్మ నిర్మాణంలో తనేదో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. నేను ఆయన్ని కలవకుండా అడ్డం పడ్డాడు. ఆ తర్వాత నేను రకరకాల ప్రయత్నాలు చేసి.. చివరికి మా కుటుంబ సభ్యులు.. స్నేహితుల సహకారంతో ‘గమ్యం’ సినిమా తీశాను. అంచెలంచెలుగా ఎదిగాను. ఈ మధ్య వర్మ గారిని కలిసినపుడు.. నేను ఒకప్పుడు చేసిన ప్రయత్నాల గురించి.. జేడీ చక్రవర్తి నన్ను అడ్డుకోవడం గురించి చెప్పాను. దానికి ఆయన నవ్వేసి.. ఈ విషయంలో జేడీకి థ్యాంక్స్ చెప్పమన్నాడు. అప్పుడు కనుక తనను కలిసి ఉంటే తన స్టయిల్లో ఒక కథ చెప్పి సినిమా తీయమని చెప్పేవాడనని.. అలా కాకుండా సొంతంగా సినిమా చేయడం వల్ల నీకంటూ ఒక పంథా ఏర్పడి మంచి మంచి సినిమాలు తీయగలిగినట్లు చెప్పారు. కాబట్టి తనను కలవకుండా చేసినందుకు జేడీకి థ్యాంక్స్ చెప్పమని వర్మ అన్నారు’’ అని క్రిష్ చెప్పాడు. ఇక ‘ఖైదీ నెంబర్ 150’తో పోలుస్తూ వర్మ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీద ప్రశంసలు కురిపించడంపై స్పందించమని అడిగితే.. ఈ గొడవలోకి నన్నెందుకు లాగుతారు అని దండం పెట్టేశాడు క్రిష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News