ఖైదీ వెర్సస్ శాతకర్ణి.. ఎంత మేలైందో?

Update: 2017-01-24 10:43 GMT
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణల మధ్య మహా సమరం జరిగింది. ఈ సందర్భంగా వారి వారి అభిమానులు పరస్పరం దూషణలకు దిగారు. అవతలి సినిమాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. తమ హీరో సినిమా గొప్పంటే తమ హీరో సినిమా గొప్ప అని చెప్పుకున్నారు. ఐతే అభిమానులు ఇలా దూషణలకు దిగుతున్నప్పటికీ ఆ హీరోలిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయిని.. నిజానికి ఇలా ఇద్దరు స్టార్ వార్ట్స్ పోటీ పడటం వల్ల పరిశ్రమకు మంచి జరిగిందని.. అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ కళకళలాడిందని క్రిష్ చెప్పాడు.

చిరు.. బాలయ్యలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం వల్ల అవతలి సినిమాలకు మేలు జరిగిందని చెబుతూ క్రాస్ ప్రమోషన్ అనే కొత్త మాట వాడాడు క్రిష్. ఈ రెండు సినిమాలు వేర్వేరు సమయాల్లో సోలోగా రిలీజై ఉంటే ఈ క్రాస్ ప్రమోషన్ ప్రయోజనం ఉండేది కాదని క్రిష్ వ్యాఖ్యానించాడు. చిరంజీవి తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో బాలయ్య సినిమా బాగా ఆడాలని కోరుకున్నారని.. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ తమ సినిమా గురించి మంచి మాటలు చెప్పారని.. ఆ రకంగా తమకు ఎంతో మేలు జరిగిందని క్రిష్ చెప్పాడు. బాలయ్యతో పాటు తాను కూడా ‘ఖైదీ నెంబర్ 150’ గురించి ఇంటర్వ్యూల్లో మాట్లాడామని.. ఆ సినిమాకు మంచి జరగాలని కోరుకున్నామని.. ఇలా ఇరు వైపుల నుంచి అవతలి సినిమాను కూడా ప్రమోట్ చేశారని.. ఈ క్రాస్ ప్రమోషన్ ఇద్దరికీ మేలు చేసిందని క్రిష్ వ్యాఖ్యానించాడు. అభిమానులు కూడా ద్వేష భావం వీడి అవతలి సినిమాలు కూడా బాగా ఆడాలని ఆకాంక్షించాలని క్రిష్ పిలుపునిచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News