మ‌ల్లేశం పాత్ర‌కు నాని.. విజ‌య్ అనుకున్నా

Update: 2019-06-22 04:41 GMT
ప్రియ‌ద‌ర్శి టైటిల్ పాత్ర‌లో చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ శుక్ర‌వారం సినిమా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. పద్మశ్రీ గ్రహీత.. చేనేత కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని క‌నుగొన్న చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను పెద్ద‌తెర‌పై ఆవిష్క‌రించేందుకు తాను ఏ విధంగా స్ఫూర్తి పొందిన‌ది తాజా ఇంట‌ర్వ్యూలో నిర్మాత రాజ్ ఇలా చెప్పుకొచ్చారు.

రాజ్ మాట్లాడుతూ..``దాదాపు 11ఏళ్ల క్రితం సొంతంగా స్క్రీన్ ప్లే రాసి ఆ క‌థ‌తో త‌మిళంలో నిర్మాత‌గా సినిమాని తెర‌కెక్కించాను. అది డిజాస్ట‌ర్ అయ్యింది. దాంతో అప్పులు చెల్లించేందుకే ఐదేళ్లు పైగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే అమెరికా వెళ్లాక సినిమా మేకింగ్ ఇంత క‌ష్ట‌మా? అని అనుకున్నా. ఆ త‌ర్వాత సినిమాలు తీయ‌క‌పోయినా కొన్ని క‌థ‌లు.. స్క్రీన్ ప్లేలు రాసుకున్నాను. వాటిలో ది బెస్ట్ అనిపించే దానికోసం వేచి చూశాను. చివ‌రికి చింత‌కింది మ‌ల్లేశం గారి గురించి తెలుసుకున్నా. ఆయ‌న క‌థ స్ఫూర్తిమంతం అనిపించింది. అటుపై ఆయ‌న‌ను క‌లిసి క‌థ‌పై రైట్స్ తీసుకుని సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాను`` అని తెలిపారు.

అయితే  స్క్రిప్టు రెడీ అయ్యాక ఈ క‌థ‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంది? అని అనుకుంటే నేచుర‌ల్ స్టార్ నాని లేదా విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే బావుంటుంద‌ని అనుకున్నా. కానీ ఆ ఇద్ద‌రూ మ‌రో మూడేళ్ల పాటు కాల్షీట్లు కేటాయించ‌లేని ప‌రిస్థితి ఉంది. ఇక ఎవ‌రున్నారు? అని వెతికితే ఎవ‌రో ప్రియ‌ద‌ర్శి పేరు సూచించారు. అయితే అప్ప‌టికే అత‌డు పెళ్లి చూపులు చిత్రంతో క‌మెడియ‌న్ గా సక్సెస‌య్యారు. ఇలాంటి సీరియ‌స్ పాత్ర‌కు సూట‌వుతారా? అని అనుకున్నా. కానీ అత‌డు న‌టించిన బొమ్మ‌ల రామారాం.. జునున్ చిత్రాలు చూశాక త‌ను మ‌ల్లేశం పాత్ర‌కు స‌రిపోతాడ‌ని అనిపించింది... అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో మ‌ల్లేశం త‌ల్లి పాత్ర‌లో ఝాన్సీ న‌టించగా.. భార్య పాత్ర‌లో అన‌న్య న‌టించారు.  రాజ్‌ ఆర్‌ సినిమాకు దర్శకత్వం వహించగా.. శ్రీ అధికారి నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేసింది.

అలాగే మ‌ల్లేశం చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు అయితే బావుంటుంద‌ని ద‌ర్శి సూచించార‌ని రాజ్.ఆర్ తెలిపారు. ``కానీ అప్ప‌టికే ద‌ర్శిని దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను రాసుకున్నా. ఇత‌ర రైట‌ర్ల‌తో నాలుగు వెర్ష‌న్లు రాయించుకున్నాను. కానీ ఇప్పుడు త‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలంటే త‌న‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇవ్వాలి. టైటిల్ పాత్ర ఎవ‌రైతే బావుంటుందో త‌న‌కే ఛాయిస్ ని ఇవ్వాలి. అయితే నేను ఇక రిస్క్ చేయ‌ద‌ల్చుకోలేదు. అందుకే నేనే దర్శ‌క‌త్వం వ‌హించాను..`` అని రాజ్.ఆర్ తెలిపారు. మొత్తానికి మ‌ల్లేశం బ‌యోపిక్ వెన‌క అంత‌టి మ‌ద‌నం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. హీరోగా వేరొక‌రిని అనుకున్నారు. ద‌ర్శ‌కుడిగా ఎవ‌రు ఉండాలి? అన్న‌దాంట్లోనూ కొంత‌వ‌ర‌కూ సందిగ్ధ‌త న‌డిచింద‌ని అర్థ‌మ‌వుతోంది.


    

Tags:    

Similar News