పవన్‌ ఫ్యాన్స్‌ లో మార్పు.. సాయి పల్లవి ఇష్యూనే సాక్ష్యం

Update: 2021-05-03 12:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ పై ఎవరైనా చిన్న కామెంట్‌ వ్యతిరేకంగా చేసినా కూడా వారిని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. సోషల్‌ మీడియాలో పవన్ వ్యతిరేకులను చీల్చి చెండాడుతూ ట్రెండ్స్ చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితమే అత్తారింటికి దారేది సినిమా లో అనసూయ నటించనంటూ చెప్పడంతో ఆమెను ఏ రేంజ్‌ లో ట్రోల్‌ చేశారో ఇప్పటికి అందరికి తెల్సిందే. పవన్‌ అభిమానులు తనను చేసిన ట్రోల్స్‌ ను ఇప్పటికి ఆమె గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.

పవన్‌ తో సినిమా చేయను అని ఏ హీరోయిన్ కూడా అనదు. ఒక వేళ ఏ హీరోయిన్‌ అయినా పవన్‌ సినిమా లో నటించేందుకు నో చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనసూయ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాని గతంలో మాదిరిగా పవన్ అభిమానులు ఆవేశంతో ఊగిపోవడం లేదు. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో పవన్‌ కు జోడీగా సాయి పల్లవిని ఎంపిక చేయడం జరిగింది. ఆమె కూడా మొదట నటించేందుకు ఓకే చెప్పి ఆ తర్వాత డేట్లు ఖాళీ లేవు అంటూ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్ దాదాపుగా ఖరారు అయ్యిందంటున్నారు.

సాయి పల్లవి రీమేక్ నుండి తప్పుకున్న వార్తలు జోరుగా మీడియాలో వస్తున్నా పవన్‌ అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. పవన్‌ మూవీ నుండి సాయి పల్లవి తప్పుకున్నా కూడా ఆమెను బ్యాడ్ గా ట్రోల్స్‌ చేయకుండా నిత్యామీనన్‌ ను ఎంపిక చేశారంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. పవన్‌ అభిమానుల నుండి సాయి పల్లవికి చేదు అనుభవం తప్పక పోవచ్చు అంటూ భావించారు. కాని సాయి పల్లవి విషయంలో పవన్‌ అభిమానులు చాలా లైట్ గానే ఉన్నారు. పవన్‌ సినిమా ను ఆమె కాదన్నందుకు బ్యాడ్‌ కామెంట్స్ ఏమీ చేయడం లేదు. ఇది పవన్‌ అభిమానుల్లో మార్పుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News