పవన్ తో కమిట్మెంట్.. తట్టుకోలేకపోయానంటోంది

Update: 2017-05-28 08:12 GMT
పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన హీరోయిన్ల కంటే కూడా.. తనతో సినిమా అవకాశం దక్కించుకున్నట్లే దక్కించుకుని చేజార్చుకున్న అనీషా ఆంబ్రోస్ కు మీడియాలో ఎక్కువ ప్రచారం లభించింది. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ కోసం పవన్ హీరోయిన్ గా ముందు అనీషా ఆంబ్రోస్ నే తీసుకుని.. ఆ తర్వాత ఆమెను తప్పించి కాజల్ అగర్వాల్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ అంత పెద్ద అవకాశం చేజారినందుకు అనీషా చాలా బాధపడి ఉంటుందని అనుకుంటాం. కానీ పవన్ తో సినిమాకు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని.. ఆ సమయంలో విపరీతమైన ప్రెజర్ ఎదుర్కొన్నానని.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశాకే రిలీఫ్ గా అనిపించిందని.. ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ ఏమీ లేవని అనీషా చెప్పింది. తాను ఓ కథానాయికగా నటించిన ‘ఫ్యాషన్ డిజైనర్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ సినిమా మిస్సవడం గురించి తన ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టింది అనీషా.

‘‘పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్ర చేసిన ‘గోపాల గోపాల’లో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ సందర్భంగా నన్ను చూసిన పవన్ గారు.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం ఆడిషన్ కు రమ్మన్నారు. నేను షాకైపోయాను. ఆడిషన్ అయిపోయాక నన్ను హీరోయిన్ గా ఓకే చేశారు. ఆ క్షణం నుంచి నేను విపరీతమైన ప్రెజర్ ఎదుర్కొన్నాను. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిగా.. పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్ సరసన సినిమా చేయబోతున్న నాకు అప్పటి పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. జనాలు నా గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు.. నిమిషానికి 200-300 మెసేజ్ లు వచ్చి పడేవి. ఇదంతా చూస్తే నాకు భయమేసింది. చాలా పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది. నన్ను కథానాయికగా ఎంపిక చేశాక ఇంకే కమిట్మెంట్ ఇవ్వొద్దని చెప్పారు. దీంతో 8 నెలల పాటు ఖాళీగా ఉండిపోయాను. ఆ సమయంలో నా మీద ఉన్న ప్రెజర్ అలాంటిలాంటిది కాదు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. అదే సమయంలో నా బదులు కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్ర చేయడానికి ఆమే కరెక్ట్. నాకీ విషయంలో ఎలాంటి బాధ అనిపించలేదు’’ అని అనీషా తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News