మాటీవీలా `ఆహా` స‌క్సెస‌వ్వాలంటే ఈజీనా?

Update: 2020-07-27 03:15 GMT
తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదం స‌రిప‌డినంత అందించేందుకు స‌రైన ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ఏదీ లేదు అనుకుంటున్న టైమ్ లోనే పారిశ్రామిక వేత్త‌ల‌తో సినీప్ర‌ముఖులు కొంద‌రు భాగ‌స్వాములుగా క‌లిసి మాటీవీని ప్రారంభించారు. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ‌తో క‌లిసి అల్లు అర‌వింద్ - చిరంజీవి- నాగార్జున త్ర‌యం పెట్టుబ‌డుల గురించి తెలిసిందే. అద్భుతంగా రంజింప‌జేసే వినోద కార్య‌క్ర‌మాల‌తో మాటీవీ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్ల‌లోనే నంబ‌ర్ వ‌న్ స్థానానికి దూసుకెళ్లింది. దానివెన‌క ప్యానెల్ కృషి మెచ్చ‌ద‌గిన‌ది. ఆ త‌ర్వాత మాటీవీ షేర్ వ్యాల్యూ పీక్స్  కి చేరుకున్న క్ర‌మంలో స్టార్ చానెల్ గ్రూప్ టేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 2500 కోట్ల మేర డీల్ కుద‌ర‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. అంత గొప్ప స‌క్సెస్ వెన‌క బిగ్ గేమ్ ప్లేయ‌ర్స్ లో బాస్ అల్లు అర‌వింద్ స‌హా ఎంద‌రో ప్ర‌ముఖులు ఉన్నారు. అర‌వింద్ కి స్టార్‌-మా డీల్ లో భారీ లాభాలొచ్చాయి.

ఈసారి కూడా బాస్ అల్లు అర‌వింద్ .. ప్ర‌ముఖ స్థిరాస్తి వ్యాపార ప్ర‌ముఖుడు మైహోమ్ రామేశ్వ‌ర‌రావుతో భాగ‌స్వామిగా క‌లిసి `ఆహా` పేరుతో ఓటీటీ రంగంలోకి ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. నెమ్మ‌దిగా ప్రారంభ‌మై `ఆహా - తెలుగు` వేదిక‌ను అంత‌కంత‌కు బ‌లోపేతం చేసేందుకు అర‌వింద్ ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అయితే ప్లానింగ్ ఎత్తుగ‌డ‌లు ఉంటే స‌రిపోతుందా?  భారీగా పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ - జీ5- హాట్ స్టార్ డిస్నీ- ఈరోస్ - స‌న్ నెక్ట్స్ లాంటి దిగ్గ‌జాలు తెలుగు సినిమాలపై భారీ పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లి ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదం అందిస్తున్నాయి. అంతే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ మూల మంచి సినిమా రిలీజైనా దానిని తెలుగైజ్ చేసి నేరుగా స్మార్ట్ ఫోన్ లోగిళ్ల‌లోకే అందించేస్తున్నాయి. క్వాలిటీ కంటెంట్ ఇవ్వ‌డంలో దిగ్గ‌జాల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది.

అందుకే ఇలాంటి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ని ఎదుర్కోవాలంటే వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌ని గ్ర‌హించిన రామేశ్వ‌ర‌రావు- అర‌వింద్ బృందం ఆ విష‌యంలో ఎంత‌మాత్రం వెన‌కాడ‌కుండా కంటెంట్ కోసం ఖ‌ర్చు చేస్తున్నారు. దశ‌ల‌వారీగా దాదాపు 1500-2000 కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక ఇందులో టాలీవుడ్ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజు చిన్న‌పాటి వాటాదారుడిగా చేరార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి వాటా ఎంత‌? అన్న‌ది అటుంచితే ఆహా కి ఇప్ప‌టికే 9ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఇంకా ఒక మిలియ‌న్ మార్క్ ని కూడా చేరుకోలేదు. దీనిని కోట్లాది మందికి చేరువ చేయాలంటే బ‌హుశా వంద‌ల కోట్లు కంటెంట్ పైనే వెద‌జ‌ల్లాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే దాదాపు 200 కోట్లు పెట్టుబ‌డి పెట్టార‌ట‌. మునుముందు ఇది అమాంతం పెర‌గ‌నుంది. ఒరిజిన‌ల్ సిరీస్ లు స‌హా చిన్న సినిమాల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేశారు. ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు స‌హా ట్యాలెంట్ ఉన్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌ను వెతికి కంటెంట్ ని వండి వారుస్తున్నార‌ని తెలుస్తోంది. ఏం చేసినా మాటీవీని మించి సక్సెస్ చేయాలంటే అంత సులువేమీ కాదు. అప్పుడు కేవ‌లం ఒక‌ట్రెండ్ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్లు మాత్ర‌మే మాటీవీకి పోటీ. కానీ ఇప్పుడ‌లా కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్గ‌జ కంపెనీలే పోటీప‌డుతున్నాయి. రామేశ్వ‌ర‌రావు.. అర‌వింద్ అండ్ కోకి ఇదొక స‌వాల్ లాంటిది.
Tags:    

Similar News