వ‌ర‌ద బాధితుల‌కు అమీర్ ఆప‌న్న హ‌స్తం!

Update: 2017-08-31 11:21 GMT
బాలీవుడ్ న‌టుల‌లో అమీర్ ఖాన్ సామాజిక అంశాల‌పై ఎక్కువ‌గా స్పందిస్తుంటాడు. గ‌తంలో స‌త్య‌మేవ జ‌య‌తే అనే సామాజిక చైత‌న్యం క‌లిగించే కార్య‌క్ర‌మాన్ని అమీర్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మం ద్వారా అనేక‌మందిని అమీర్ చైత‌న్య‌ప‌రిచాడు. సినిమాల‌లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అమీర్ త‌న ద‌యాగుణాన్ని చాటుకుంటుంటాడు. ఇటీవ‌ల భారీ వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌ల‌మైన బిహార్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అమీర్ త‌న‌వంతు సాయం చేశాడు. రూ.25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను బిహార్ వ‌ర‌ద బాధితుల‌కు అందించి త‌న ఉదార‌త‌ను మ‌రోసారి చాటుకున్నాడు. అంతేకాకుండా, త‌న అభిమానుల‌ను కూడా వ‌ర‌ద‌బాధితుల‌కు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చాడు.

కొద్ది రోజుల క్రితం బిహార్ ను వరదలు ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర‌ద‌ల‌తో అక్క‌డి ప్ర‌జా జీవ‌నం అత‌లాకుత‌ల‌మైంది. ఈ వరదల ధాటికి సుమారు 415 మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బిహార్‌లోని 21 జిల్లాల పరిధిలో ఉన్న 1.70 కోట్ల మంది ప్రజలు ఈ వరద ప్రభావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో వ‌ర‌ద బాధితుల‌కు తన వంతు సాయంగా అమిర్‌ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు రూపంలో కొరియ‌ర్ చేశారు. అమీర్ ఈ ర‌కంగా వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేయ‌డం ఇదే మొద‌టి సారి కాదు.  గత నెలలో ఇదే తరహాలో అసోం, గుజరాత్‌లలో వచ్చిన భారీ వరదల సమయంలో అక్కడి బాధితులకు విరాళం అందజేశారు. అసోం వ‌ర‌ద బాధితుల కోసం అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌ర‌పున రూ.25 ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం అంద‌జేసినందుకు అసోం సీఎం సోనోవాల్ ....అమీర్ కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు.
Tags:    

Similar News