ఆదిత్యా నుంచి అతి పెద్ద ప్రకటన ఏదై ఉంటుంది?
బాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర దర్శకుడిగా ఆదిత్యాధర్ పేరు మారుమోగిపోతోంది. ధురంధర్, ధురంధర్ 2 వంటి సంచలన ఫ్రాంచైజీ చిత్రాలతో ఏకంగా 3,000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించారు.
బాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర దర్శకుడిగా ఆదిత్యాధర్ పేరు మారుమోగిపోతోంది. ధురంధర్, ధురంధర్ 2 వంటి సంచలన ఫ్రాంచైజీ చిత్రాలతో ఏకంగా 3,000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించారు. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్నా... ఆదిత్య ఏమాత్రం గర్వం చూపించకుండా ముంబైలోని తన చిన్న ఆఫీస్లో చాలా సాదాసీదాగా ఎప్పటిలాగే స్క్రిప్టు పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. తన ఆస్థాన రచయితలతో కలిసి ఎలాంటి ఆడంబరాలు లేకుండా తన పనిలో తాను మునిగి ఉన్నారట.
అయితే ప్రస్తుతం ఆదిత్యాధర్ రాస్తున్న ఈ సరికొత్త స్క్రిప్టు ఎవరి కోసం? దీనికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారా? వంటి రకరకాల సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ముంబై మీడియా తాజా కథనాల ప్రకారం.. ఈసారి కూడా ఆదిత్యాధర్ తన లక్కీ హీరో రణ్వీర్ సింగ్తోనే ఈ కొత్త ప్రాజెక్ట్ను వర్కవుట్ చేస్తున్నట్లు బలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమై ఈ క్రేజీ కాంబినేషన్ గనుక మళ్లీ పట్టాలెక్కితే అది బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సెన్సేషన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆదిత్యాధర్ మేకింగ్ శైలి, విజువలైజేషన్ స్కిల్ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం దృష్ట్యా, ఈసారి అతడు ఏ సినిమా తీసినా అది పాన్ వరల్డ్ రేంజ్లో క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం. అయితే ఇప్పటివరకు అతడు ఎంపిక చేసుకున్న మిలిటరీ, స్పై ఆపరేషన్ల నేపథ్యం కాకుండా ఈసారి స్క్రిప్ట్ ఇంకేదైనా సరికొత్త కాన్సెప్ట్తో ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిత్యాధర్ మార్క్ మేకింగ్ శైలిలో ఏదైనా పురాణ పురుషుడి కథాంశం తెరపైకి వస్తుందా? అనే కోణంలో కూడా సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
నిజానికి ఆదిత్యాధర్ గతంలో `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ` అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను తలపెట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాను సెట్స్పైకి తీసుకురావడానికి ఇది సరైన సమయం కాదనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఫిక్షనల్ పౌరాణిక చిత్రం `కల్కి 2898 ఏడి` కథంతా అశ్వత్థామ చుట్టూనే తిరుగుతుంది. ఆ చిత్రంలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ను ఒక ప్రధాన కథానాయకుడిగా చూపించడమే కాకుండా..రెండో భాగంలోనూ ఆ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది.
ఈ నేపథ్యంలో అశ్వత్థామ కథను పక్కనబెట్టి రణ్వీర్ సింగ్ ఇమేజ్కు సరిపోయేలా సరికొత్త కథా వస్తువును సిద్ధం చేసే పనిలో ఆదిత్య నిమగ్నమయ్యారు. ఆదిత్యాధర్ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుని ముందుకు సాగుతున్నట్టు..ఇంకా టైట్-లిప్డ్గా ఉంటూ కేవలం తన పనిపైనే దృష్టి పెట్టారు. ప్రతిభావంతుడైన అగ్ర దర్శకుడి చిన్న ఆఫీస్ నుండి రానున్న అతి పెద్ద అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.