రిటైర్మెంట్ పై అప్పుడే నిర్ణయం.. ధోనీ కీలక వ్యాఖ్యలు
భారత క్రికెట్ లో ప్రస్తుతం రిటైర్మెంట్ ల టైమ్ నడుస్తోంది. ఈ ఏడాది ప్రారంభమే అసలు రిటైర్మెంట్ లతో మొదలైంది.;

భారత క్రికెట్ లో ప్రస్తుతం రిటైర్మెంట్ ల టైమ్ నడుస్తోంది. ఈ ఏడాది ప్రారంభమే అసలు రిటైర్మెంట్ లతో మొదలైంది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) జరుగుతుండగానే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యాడు. ఇప్పటికే వన్డేలు, టి20 జట్టులో లేనందున అశ్విన్ ఆడేది ఐపీఎల్ మాత్రమే. కాబట్టి అతడి రిటైర్మెంట్ పెద్దగా విషయం కాదు. ఇక రెండేళ్ల కిందట టి20లకు దాదాపు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు నిరుడు టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఈ ఫార్మాట్ కు బెబై చెప్పేశారు. ఇక అనూహ్యంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ కు కూడా కోహ్లి, రోహిత్ కూ వీడ్కోలు పలికారు. వీరిక ఆడేది వన్డేలు మాత్రమే.
మరొక్క ఆటగాడి రిటైర్మెంట్ గురించి ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. అతడే దిగ్గజం మహేంద్ర సింగ్. సాధారణంగా 44 ఏళ్ల వయసుకు ఆటగాళ్లు మాజీలు అయిపోతారు. కామెంట్రీ బాక్స్ లో కనిపిస్తారు. లేదంటే కోచ్ లుగా మారతారు. ధోనీతో పాటే టీమ్ ఇండియాలోకి వచ్చిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు అదే జట్టుకు హెడ్ కోచ్. ధోనీ మాత్రం ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు. 2020 ఆగస్టులోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో ఓ మ్యాచ్ కు ఎన్నడూ లేనిది ధోనీ తల్లిదండ్రులు కూడా రావడంతో ఇక అతడు రిటైర్ కావడమే తరువాయి అని కథనాలు వచ్చాయి.
ఈ ఏడాది జూలై 7కు 44 ఏళ్లకు కూడా పూర్తిచేసుకునే ధోనీ 45వ ఏటకు అడుగుపెడతాడు. కానీ, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యేది మాత్రం ఎప్పుడో చెప్పడం లేదు. పైగా రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ఈ ఏడాది అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ కూడా చేపట్టాడు. తాజాగా ఐపీఎల్ లీగ్ దశలో చెన్నై మ్యాచ్ లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్ కు చిత్తుగా ఓడించడంతో ఓదార్పు విజయం దక్కింది. మొత్తం 14 మ్యాచ్ లకు గాను 4 మ్యాచ్ లలోనే చెన్నై నెగ్గింది. దీంతో 8 పాయింట్లతో టేబుల్ లో చిట్టచివరన నిలిచింది.
గుజరాత్ పై విజయం తర్వాత ధోనీ మ్యాచ్ ప్రజంటేషన్ లో మాట్లాడాడు. తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికీ కంగారేమీ లేదని.. మరో నాలుగైదు నెలలు సమయం ఉందని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. మరోవైపు ప్రదర్మన ఆధారంగా ఆటగాడు రిటైర్ కావాలి అని అంటే.. .ప్రతి ఒక్కరూ 22 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుందని తనదైన శైలిలో వెటకారం ఆడాడు. 2026 ఐపీఎల్ కు వస్తానని, రానని చెప్పలేనని.. తాపీగా కూర్చుని నిర్ణయిస్తానని తెలిపాడు.
ధోనీ వ్యాఖ్యలు చూస్తుంటే అతడు ఆఖరి ఐపీఎల్ సీజన్ ఆడేసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లే ఐపీఎల్ కూ మౌనంగాబైబై చెబుతాడని పేర్కొంటున్నారు.