పవన్ కు జెడ్ కేటగిరి భద్రత.. అసలు నిజం ఇదే

Update: 2020-10-05 09:10 GMT
సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక అబద్దాన్ని నిజంగా నమ్మించే ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. విన్నంతనే నమ్మేందుకు వీలుగా ఉండేలా మసాలా దట్టించే వార్తల జోరు పెరుగుతుంది. ఆ కోవలోకే వస్తుంది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించినట్లుగా ప్రచారం జరిగింది. విన్నంతనే చాలామంది ఇది నిజమని నమ్మటమే కాదు.. తమదైన వ్యాఖ్యలు జోడిస్తూ తెలిసిన వారికి ఫార్వర్డ్ చేశారు.

ఈ మధ్యనే కేంద్ర సర్కారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఇవ్వటం.. మరో వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్ కు కేంద్ర బలగాల భద్రతను ఇచ్చిన దరిమిలా.. పవన్ కల్యాణ్ కు జెడ్ కేటగిరి భద్రత ఇచ్చినట్లుగా జరిగిన ప్రచారాన్ని నమ్మేశారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకు తగ్గట్లే ఆయనకు భారీ భద్రతను కేంద్రం కల్పించిందన్న మాట వినిపించింది. ఈ మధ్యనే బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పవన్ కు.. 22 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది..నలుగురు జాతీయ స్థాయి ఎన్ ఎస్ జీ కమాండోలు భద్రతను పర్యవేక్షిస్తారన్న ప్రచారం జరిగింది.

ఈ ఫేక్ న్యూస్ వైరల్ కావటతో జనసేన స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని తేల్చారు. తాము భద్రత కోసం కేంద్రాన్ని కోరలేదని.. అదే రీతిలో కేంద్రం కూడా పవన్ భద్రత గురించి సంప్రదించలేదని తేల్చింది. తప్పుగా ప్రచారం జరుగుతున్న దానిని నమ్మొద్దని  జనసేన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అబద్ధం వైరల్ అయినంత వేగంగా.. జనసేన వివరణ మాత్రం వైరల్ కాకపోవటం గమనార్హం.
Tags:    

Similar News