ప్యాకేజీ తీసుకొని బాబుకు పని చేస్తున్న పవన్..!

Update: 2019-09-15 11:08 GMT
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి వంద రోజులు జస్ట్ దాటినప్పటికీ.. అదేదో మూడునాలుగేళ్లు నిండిపోయి.. ఎన్నికల ఏడాది వేళలో ఆగమాగం చేస్తారో అంతే హడావుడి చేస్తున్నారు విపక్ష నేతలు. జగన్ వంద రోజుల పాలనపై పుస్తకాన్ని అచ్చేసిన జనసేన అధినేత దారుణమైన ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పవన్ తీరును ఖండిస్తున్నారు.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆర్కే రోజా రియాక్ట్ అయ్యారు. పవన్ తీరును ఆమె తప్పు పట్టారు. జగన్ వంద రోజుల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని.. విపక్షాలే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నట్లుగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై పుస్తకం వేసిన పవన్ పై ఆమె విరుచుకుపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా.. జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు.

గతంలో పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు పవన్ తో విమర్శలు చేయిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం మీద పవన్ కల్యాణ్ విడుదల చేసిన పుస్తకం.. టీడీపీ కార్యాలయంలో తయారు చేసి.. పవన్ చేత రిలీజ్ చేయించారన్నారు. జగన్ వంద రోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించారని ప్రశంసించారు.

ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేన రిలీజ్ చేసిందన్న రోజా.. ప్యాకేజీలు తీసుకొని పవన్ చంద్రబాబుకు పని చేస్తున్నారన్నారు. జగన్ వంద రోజుల పాలన మీద పుస్తకాన్ని విడుదల చేసిన పవన్.. చంద్రబాబు పాలన మీద ఎందుకు పుస్తకాలు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

ఈ తీరు మంచి పద్దతి కాదని.. దీనికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాబు తరఫున పవన్ కల్యాణ్ పని చేస్తున్నారన్న ఆరోపణలు చేసిన రోజాపై పవన్ ఏలా రియాక్ట్ అవుతారో చూడాలి. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజాకు పవన్ నుంచి ఈసారి ఘాటు కౌంటర్ తప్పదంటున్నారు.


Tags:    

Similar News