జగన్ బాబు కొత్త స్కెచ్

Update: 2015-09-12 09:50 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పాగా వేసేందుకు దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఇపుడు కొత్త ఎత్తు మొద‌లుపెట్టారా? ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చూపెడుతున్న వ‌ల్ల‌మాలిన ప్రేమ ఆయ‌న‌కు ఇబ్బందిగా మారుతుందా?  బాబు బ‌లాన్నే జ‌గ‌న్ బ‌ల‌హీన‌త‌గా భావిస్తున్నారా? అంటే అవున‌నే స్పంద‌న వ‌స్తోంది వైసీపీ ఎత్తుగ‌డ‌లు చూస్తుంటే.

23 జిల్లాలున్నఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ గా ఏర్ప‌డిన‌పుడు సీమ‌లో రాజ‌ధాని పెట్టాల‌నే చ‌ర్చ జ‌రిగింది. కానీ కోస్తాంధ్ర‌కే ఆ అవ‌కాశం ద‌క్కింది. ఆ విష‌యం ప‌క్క‌న‌పెట్టినా...రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో ఉన్న ఏపీలో కేవలం రెండు మూడుజిల్లాలే అన్ని రంగాల్లో  దూసుకుపోతున్నాయన్న చర్చ వైసీపీ ఎమ్మెల్యే ల్లో జరుగుతోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అనంతపురం - కర్నూలు - కడప - చిత్తూరు - శ్రీకాకుళం -  విజయనగరం వంటి జిల్లాలను విస్మరించారిన ప‌రిస్థితే ఇపుడు ఎదురువుతోంద‌ని వైసీపీ భావిస్తోంది. కృష్ణా - గుంటూరుతో పాటు కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన వారిదే  రాజకీయాల్లో పైచేయి ఉంటోందని - టీడీపీ ప్రభుత్వం నిధులను - అభివృద్ధి పనుల్ని ఆ జిల్లాలకే ఇస్తోందని ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యే లు రగిలిపోతున్నారు

విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏపీలో నెల‌కొల్పాల్సిన విద్యాసంస్థలు - ఇత‌ర  సంస్థలు కూడా ఆ రెండు జిల్లాల‌కు చెందిన నాయ‌కులే త‌ర‌లించుకుపోతున్నారంటున్నారు. ఇప్ప‌టికే గుంటూరు జిల్లాల్లోనే ప్రస్తుత రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుంద‌ని, నిధుల‌ విష‌యంలోనూ త‌మ‌కు తీర‌ని అన్యాయం  జ‌రుగుతుంద‌ని వైసీపీ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకుంటున్నారు. సీఏంగా రాయలసీమకు చెందిన  నేత ఉన్నా... సీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నది ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణ. త‌ర‌త‌రాలుగా వెనుక‌బ‌డిన జిల్లాలుగా  ఉన్న ప్రాంతాల‌కు ఎక్కువ నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌న లేక‌పోవ‌డంతో ఆర్థికంగా - సామాజికంగా  దుర్భర ప‌రిస్థితులు అనుభ‌విస్తున్నామ‌ని కుమిలిపోతున్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ  ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత జోనల్‌ వ్యవస్థను రద్దు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ను ఒకే జోన్‌ గా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 120 విడుదల  చేసింది.  దీంతో ఏ జిల్లాకు చెందినవారైనా రాష్ట్రమంతటా ఎక్కడైనా కాలేజీల్లో సీట్లు - ఉద్యోగాలు పొందొచ్చు. ఈ  జీఓ ద్వారా శ్రీకాకుళం - విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న చర్చ ఆ ప్రాంత  ఎమ్మెల్యేల్లో జరుగుతోంది. ఒకే జోన్‌ గా ఉండటం ద్వారా ఆయా జిల్లాలకు రావాల్సిన ఉద్యోగాలు ఇతర జిల్లాలవాళ్లు  ఎగరేసుకుపోతారంటూ వైసీపీ  ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అక్షరాస్యత - విద్యాపరంగా కోస్తాంధ్ర జిల్లాలే ప్రథమస్థానాల్లో ఉన్నాయని, దీంతో జీఓ  120 కారణంగా ఆ జిల్లావాళ్లే ఉద్యోగాలు - కాలేజీల్లో సీట్లు ఎగరేసుకుపోతారని...దీంతో తమ జిల్లాల  యువత ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.

తమ ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకూడదని, పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లేందుకు ఇదే అవ‌కాశ‌మ‌ని  వెనుకబడిన జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట.  జీఓ 120 ద్వారా జరుగుతున్న నష్టాలను, చెలరేగే విద్వేషాలను ప్రజలకు - యువతకు వివరిస్తూ పోరాటాలు చేయాలని ప్రాథ‌మికంగా చ‌ర్చించార‌ని స‌మాచారం. పార్టీ తరఫున కార్యక్రమాలు చేసి ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌య‌మై జ‌గ‌న్ అత్యంత స‌న్నిహితుడైన ఎమ్మెల్యే గా పేరున్న గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి చేప‌ట్ట‌డం దీనికి బ‌లం చేకూరుస్తోంది. మొత్తంగా వైసీపీ కొత్త స్కెచ్ ఏ విధంగా వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి మ‌రి.
Tags:    

Similar News