ఇంత జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబు మౌనం వ్యూహాత్మ‌క‌గా? నిర్వేద‌మా?

Update: 2020-10-13 08:30 GMT
``ఏపీ ప‌రిస్థితి ఇప్పుడు మామూలుగా లేదు. ప్ర‌తిపక్ష నేత‌కు అగ్ని ప‌రీక్షే``- ఇదీ తాజాగా కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. దీనికి కార‌ణం.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. ప్ర‌తిప‌క్ష నేత మాజీ సీఎం చంద్ర‌బాబును భారీ ఎత్తున టార్గెట్ చేయ‌డ‌మే! నేరుగా ఆయ‌నకు సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు మధ్య సంబంధాలు ఉన్నాయ‌ని, చంద్ర‌బాబు కోరిక మేర‌కు ఏపీ హైకోర్టును జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ శాసిస్తున్నార‌ని పేర్కొంటూ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేయ‌డం.. దీనికి సంబంధించిన ప్ర‌తి విష‌యం బ‌హిరంగంగా వెల్ల‌డించ‌డం వంటివి సంచ‌ల‌నం సృష్టించాయి.

అంతేకాదు.. తాజాగా ``సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి ప‌దవికి బీసీలు ప‌నికిరారు`` అంటూ.. గ‌తంలో చంద్ర‌బాబు వ్యాఖ్యలు చేసిన‌ట్టు.. ఆధారాల‌తో స‌హా ప్ర‌భుత్వ చీఫ్ విప్.. గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మ‌రి ఇంత రేంజ్‌లో చంద్ర‌బాబు చుట్టూ.. విమ‌ర్శ‌ల సుడులు, వివాదాల గూళ్లు అల్లుకుంటున్నా.. ఆయ‌న ఎందుకు మౌనంగా ఉన్నారు?  సాధార‌ణంగా.. త‌న‌పై ఏ చిన్న విమ‌ర్శ త‌న‌పై వ‌చ్చినా.. వెంట‌నే రియాక్ట్ అయి.. జ‌గ‌న్‌పైనా ఆయ‌న ప‌రివారం, ప్ర‌భుత్వంపైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించే చంద్ర‌బాబు.. ఇప్పుడు ఇంత జ‌రుగుతున్నా.. ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అస‌లు ఈ వివాదాలేవీ కూడా త‌న‌కు తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు.

అంతేకాదు.. ఎప్పుడూ దూకుడుగా ఉండే మాజీ మంత్రులు దేవినేని ఉమా, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వంటి వారు కూడా ఈ విష‌యంపై ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది?  చంద్ర‌బాబుది వ్యూహాత్మ‌క మౌన‌మా?  లేక ఏమైనా ఉందా? అనే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. విష‌యాన్ని కొంత లోతుగా అర్ధం చేసుకుంటే.. చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై ఆయ‌న ఏ ఒక్క మాట మాట్లాడినా.. వైసీపీ మ‌రింత రెచ్చిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇది మ‌రింత ప్ర‌మాద‌మ‌ని.. లేనిపోని ప్ర‌చారానికి, వివాదానికి తానే స్వ‌యంగా గొయ్యి త‌వ్వుకున్న‌ట్టు ఉంటుంద‌ని బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు.

కాగా, ఆయ‌న‌కు అందివ‌చ్చిన వ‌రంగా.. ఈ వివాదాలు ఓ వైపు జ‌రుగుతుండ‌గానే ఆయ‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ఉద్య‌మానికి 300 రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో త‌మ్ముళ్ల‌తో రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న టీడీపీ నాయ‌కులు రాజ‌ధానిని టార్గెట్ చేసుకుని..  జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు త‌ప్ప‌.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌, సీఎం జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల జోలికి వెళ్లలేదు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. వ్యూహాత్మ‌కంగానే బాబు ఈ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి మున్ముందైనా.. అంటే త‌న త‌ప్పులు లేవ‌ని కొంత‌మేర‌కైనా ధైర్యం వ‌స్తే.. పెద‌వి విప్పే ఛాన్స్ ఉంటుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News