లోకేశ్ ను నిలదీసిన సొంత జిల్లా ప్రజలు

Update: 2017-04-22 10:33 GMT
ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మునగాల పాలెం వెళ్లిన మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. మీ వెనుక ఉన్న వారి వళ్లే ఇదంతా జరిగిందంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బొజ్జల - ఆయన కుమారుడు చేస్తున్న ఇసుక దందా వల్లే ఫిర్యాదు చేయడానికి గ్రామస్తులు ఏర్పేడు వెళ్లారని బాధితులు చెప్పారు. దీంతో మునగాల పల్లిలో ఇసుక దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు.
    
మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేసినట్లు చెప్పారు. అలాగే మృతులు తెలుగుదేశం కార్యకర్తలు కనుక పార్టీ నుంచి రెండు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. తాను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. ఈ సంఘటనకు వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
    
 ఏర్పేడులో గ్రామస్తులు కొందరు అభివృద్ధి పనుల విషయంలోనూ లోకేష్ ను నిలదీశారు. అమరావతికే కాదు మా గ్రామాలకు కూడా రోడ్లు కావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మంత్రులతో పాటు ఉన్న మాజీ మంత్రి బొజ్జలను గ్రామస్తులు నిలదీశారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొజ్జల వెనుక ఉన్నవారే దీనికి కారణమని నిందించారు. బొజ్జలను ఒక మహిళ నిలదీసింది. ఏర్పేడు ప్రమాదంలో తన భర్తను కోల్పోయిన ఆ మహిళ…మీరు ఐదు లక్షలు ఇవ్వడం కాదు, నేను పది లక్షలు ఇస్తా నా భర్తను బతికించి తీసుకురాగలరా? అని ప్రశ్నించింది. ఇసుక దందా గురించి మీకు తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News