జగన్ స్ఫూర్తితో కర్నాటకలో కొత్త పార్టీ?

Update: 2019-09-14 16:43 GMT
రాజకీయంగా నిత్యం ఏదో ఒక సంచలనం నమోదయ్యే కర్ణాటకలో త్వరలో మరో సంచలనం నమోదు కానుందని అక్కడి రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారమవుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌ గా పేరొందిన డీకే శివకుమార్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈ ట్రబుల్ షూటర్ ప్రస్తుతం మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన గత ఎన్నికల్లో అత్యంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోయి బీజేపీ పరం కాకుండా అన్ని రకాలుగా కాపాడి కాంగ్రెస్ - కుమారస్వామిల ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల తిరుగుబాటు వచ్చినప్పుడూ శాయశక్తులా ప్రయత్నించారు. అలాంటి శివకుమార్‌ ను బీజేపీ ఈడీ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కాంగ్రెస్ అదిష్ఠానం కామ్ గా ఉంది. సోనియా ఒకసారి దీనిపై మాట్లాడినా మిగతా జాతీయ స్థాయి నేతలెవరూ దానిపై స్పందించకపోవడం - కేంద్రంపై ఒత్తిడి తేకపోవడంతో డీకే తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. కేసుల నుంచి కాస్త ఉపశమనం దొరకగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనకు ఆయన వచ్చారని చెబుతున్నారు.

నిజానికి కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందని శివకుమార్ ఆశించారు. అయితే అప్పుడు ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఆయన కర్నాటక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ అధిష్ఠానం స్పందించడంలేదట. ఒకవేళ కర్నాటక పీసీసీ పదవి ఆయనకు ఇస్తే పార్టీలో కొనసాగుతారని.. లేదంటే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు.

శివకుమార్ సామాజిక వర్గమైన వక్కళిగ కులస్థులు కర్నాటకలోని 12 జిల్లాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తారు. వారి దన్నుతోనే ఆయన సొంత పార్టీ పెట్టే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోరాడి - ప్రజల్లోకి వెళ్లి సీఎం కావడాన్ని ఆయన తన అనుచరుల వద్ద ఉదహరిస్తున్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News