ఇంత ఆగమైన వేళలోనూ.. బయటకు రాని సీఎం కేసీఆర్

Update: 2020-10-16 03:30 GMT
రోటీన్ కు భిన్నమైన సీన్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. భారీ వర్షాలతో తెలంగాణలోని 85 శాతం జిల్లాలు ప్రభావితం కావటం.. హైదరాబాద్ మహానగరం భారీగా ప్రభావానికి గురి కావటం తెలిసిందే. భారీవర్షం.. వరదపోటుతో ఇంత భారీగా నష్టం చోటు చేసుకోవటం.. ఇటీవలకాలంలో ఇదే తొలిసారి. ఇలాంటివేళ.. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు రావటం.. బాధిత ప్రాంతాల్లో పర్యటించటం కాకున్నా.. కనీసం ఏరియల్ సర్వేను చేపడతారు.

దీనితో భారీ వర్షం కారణంగా చోటు చేసుకున్న నష్టం కళ్లకు కట్టినట్లుగా తెలీటంతో పాటు.. ప్రభుత్వ పరంగా ప్రాధాన్యతలు నిర్దేశించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ తరహా విపత్తుచోటు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రులు మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వే నిర్వహిస్తుంటారు.అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్పించి.. ప్రగతిభవన్ నుంచి బయటక వచ్చింది లేదు. బాధితుల గురించి తాను స్వయంగా చూసే ప్రయత్నం చేయలేదు.

 అదే సమయంలో మంత్రి కేటీఆర్ మాత్రం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లోపర్యటిస్తున్నారు. బాధితులను ఊరడిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయాన్ని అందిస్తామని చెబుతున్నారు. పలు హామీలు ఇస్తున్నారు. ఇంతవరకు ఓకే కానీ.. ఇలాంటి విపత్తుల సమయంలో అయినా సీఎం కేసీఆర్ బయటకు వచ్చి.. ప్రభుత్వం అండగా ఉంటుందని.. తాము చేపట్టిన సహాయక చర్యల గురించి మాట్లాడి ఉంటే బాగుంటుందనన వాదన వినిపిస్తోంది.

ఏమైనా.. ఇంత భారీ నష్టం జరిగిన వేళలోనూ.. పరామర్శల కోసం బయటకు అడుగు పెట్టని ముఖ్యమంత్రిగా మాత్రం కేసీఆర్ మిగిలిపోతారు. విపత్తు వేళ.. పరామర్శిస్తేనే ప్రభుత్వం స్పందిస్తున్నట్లా? పని చేస్తున్నట్లా? అన్న ప్రశ్నలు వేసిన పక్షంలో.. మంత్రి కేటీఆర్ కూడా పరామర్శలకు.. పర్యటనలు చేపట్టాల్సిన అవసరం లేదు కదా? ఏమైనా పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు.. విపత్తుతో ప్రజలంతా ఆగమైనప్పుడు ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం పలువురి నోట వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News