బాబు మెంటల్‌ గా అన్‌ ఫిట్..: విజయసాయిరెడ్డి

Update: 2018-11-17 15:03 GMT
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమాత్రం బాగులేదని... బుర్ర సరిగా లేని మనిషి సీఎంగా ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్సార్‌సీపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును నరకాసురుడిగా వర్ణించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆయనకు పట్టదన్నారు. ఓటమి భయంతో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
    
రానున్న ఎన్నికల తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావడం ఖాయమని విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు.
     
కాగా సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగరిలో వైసీపీ బహిరంగ సభ, సమీక్ష సమావేశం నిర్వహించారు. బహిరంగ సభకు జనం పోటెత్తారు. అనంతరం ఎన్నికల కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కూర్పు, తదితర అంశాలపై స్థానిక నాయకులతో చర్చించారు.



Tags:    

Similar News