బాగా చేశారు.. బాబు: ప్రధాని మోడీ కితాబు!
సాధారణంగా ఎవరికీ అంతత్వరగా కితాబు ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ''బాగా చేశారు బాబూ'' అంటూ ప్రశంసించడం గమనార్హం.
సాధారణంగా ఎవరికీ అంతత్వరగా కితాబు ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ''బాగా చేశారు బాబూ'' అంటూ ప్రశంసించడం గమనార్హం. తన ప్రసంగం పూర్తయిన తర్వాత.. వేదికపై కూర్చున్న ఆయన.. చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం.. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా తీసుకుని నిర్వహించడమే. 13 వేల మంది గిరిజన యువతులతో ఏర్పాటు చేసిన థింసా నృత్యం చూసేందుకు రెండు కళ్ల చాలలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే.. విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టిన నాటి నుంచి పూర్తయ్యే వరకు మధ్య ఉన్న అన్ని ఘట్టాలతో కూడిన ఫొటోలతో పెద్ద ఆల్బమ్ను ప్రదర్శించారు.
అలాగే ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు.. ఇక్కడి పరికరాలు.. ఇలాంటి అనేక విషయాలతో సభ ముందు ప్రత్యేక తెరను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఇవన్నీ.. అమితంగా ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతి పెద్ద వీడియో వాల్ పరిశీలించిన ప్రధాని.. ముగ్ధులయ్యారు. వీడియో వాల్లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షే త్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రాక అంశాలను ప్రధానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఎయిర్ పోర్టు నమూనాను జీఎమ్మార్ ప్రతినిధులు ప్రధాని వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు.
ఓపెన్ టాప్ జీపులో సభకు రెండు వైపులా ఏర్పాటు చేసిన గ్యాలరీలలో 13,500 మంది గిరిజన యువతుల థింసా నృత్యాన్ని ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆసక్తిగా పరిశీలించారు. ఓపెన్ టాప్ జీపులోనే సభా వేదిక వద్దకు వెళ్లారు. వేదిక మీదకు చేరుకున్న ప్రధానికి పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ.. జాతీయ జెండాలతో ప్రజలు స్వాగతం పలికారు. వేదిక మీదకు చేరుకున్న ఏపీ, గోవా గవర్నర్ లు అబ్దుల్ నజీర్, అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ సహా రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఘనమైన స్వాగతం లభించింది.
మోడీకి కానుకలు..
ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు పలు కానుకలు అందించారు. సహజంగా శాలువా, మొమెంటోతోనే సరిపుచ్చకుండా.. ఇతర కానుకలు కూడా అందించారు. పొందూరు ఖాదీ శాలువాతో ప్రధానిని సత్కరించిన సీఎం చంద్రబాబు... బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించారు. గిరిజన సంప్రదాయ పూసలతో చేసిన హారాలు, దుస్తులను కూడా కానుకగా అందించారు.