బాబు ఉలిక్కిపడేలా విజయసాయి ట్వీట్

Update: 2019-08-23 17:30 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి ఆసక్తికర ట్వీట్ చేశారు. బాబును ఉద్దేశించి ఆయన చేసిన తాజా ట్వీట్ లో టీడీపీ అధినేత కొత్త కుట్ర గురించి బయటపెట్టే ప్రయత్నం చేశారు. తనకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లను బీజేపీలో చేర్పించటం ద్వారా బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

తనకు సంబంధించిన విషయాల్ని సెటిల్ చేసేందుకు.. అవసరానికి తగ్గట్లుగా బీజేపీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలను లాబీయింగ్ ద్వారా ప్రభావితం చేసేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న అర్థం వచ్చేలా విజయసాయి తాజా ట్వీట్ ఉంది. కాస్త ఆలస్యమైనా.. కుట్రలు.. దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందన్నారు. ఇందుకు చిదంబరం ఉదాహరణను ప్రస్తావించారు.

కేంద్రమాజీ మంత్రి చిదంబరం 20సార్లు ముందస్తు బెయిల్ తో అరెస్ట్ ను తప్పించుకున్నా.. చివరకు కటకటాల పాటు కాక తప్పదని.. 18 అవినీతి కేసుల్లో  స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉంటుందన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం గతంలో మాదిరి సులువు కాదన్నారు. బీజేపీ నేత సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కన్నబాబును కదిలించి తనకు అనుకూలమైన  వారిని.. తనకు విధేయుడైన వ్యక్తిని నియమించుకునేందుకు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం సుజనా చౌదరీ.. సీఎం రమేశ్ లతో లాబీయింగ్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే పరిణామాల్ని ఎప్పటికప్పుడు తమ బాస్ కు వారిద్దరు బ్రీఫ్ చేస్తుంటారని ఆరోపించారు. మొత్తానికి బాబు ఉలిక్కిపడేలా విజయసాయి తాజా ట్వీట్ ఉందని చెప్పక తప్పదు. మరి.. దీనిపై బాబు.. సుజనా.. సీఎం రమేశ్ లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News