విద్యాసాగర్ రావు ఇక లేరు

Update: 2017-04-29 08:22 GMT
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు.. తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శనివారం ఉదయం పదకొండున్నర ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. విద్యాసాగర్ రావు కొంత కాలంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐతే కొన్ని రోజుల కిందటే ఆయన పరిస్థితి విషమంగా మారింది. అప్పట్నుంచి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. శనివారం పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

సాగునీటి రంగంలో తెలంగాణ అనే కాదు.. దేశంలోనే అత్యంత అవగాహన ఉన్న నిపుణుల్లో విద్యాసాగర్ రావు ఒకరు. సాగునీటి వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఎప్పట్నుంచో గళం విప్పుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ విద్యాసాగర్ రావు చురుగ్గా పాల్గొన్నారు. ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర కూడా చేయడం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. అందుకే ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. విద్యాసాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఇటీవలే కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్‌ రావు.. రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధ పడుతున్నారు. ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News