ఉప రాష్ట్రప‌తి ఎన్నిక కాస్త డిఫ‌రెంట్

Update: 2017-08-05 05:06 GMT
మ‌రికాసేప‌ట్లో ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం బీజేపీ.. మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థిగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌.. యూపీఏ కూట‌మి అభ్య‌ర్థిగా గాంధీ కుటుంబానికి చెందిన గోపాల‌కృష్ణ గాంధీ బ‌రిలో ఉన్నారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌కు భిన్నంగా సాగుతుంది ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌. రాష్ట్రప‌తిని ఎన్నుకోవ‌టం కోసం ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఓటు వేయ‌టం తెలిసిందే. అయితే.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక మాత్రం అందుకు భిన్నంగా సాగుతుంది. ఉప రాష్ట్రప‌తిని రాష్ట్రాల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకోవ‌టం అన్న‌ది ఉండ‌దు.

ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేసే వారు ఎవ‌రన్న‌ది చూస్తే.. లోక్ స‌భ‌లోని ఎంపీల‌తో పాటు రాజ్య‌స‌భ‌లోని ఎంపీలు కూడా ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పాల్గొంటారు. తాజాగా ఎన్నికలో ఆయా పార్టీల అభ్య‌ర్థులకు ప‌డే ఓట్లను చూస్తే.. వెంక‌య్య గెలుపు నామ‌మాత్రం మాత్ర‌మే. ఆయ‌న గెలుపు ఎప్పుడో ఖ‌రారు అయిపోయింది కూడా.

ఎందుకంటే.. లోక్ స‌భ‌లోని 545 మంది ఎంపీలు.. రాజ్య‌స‌భ‌లోని 245 మంది ఎంపీలు క‌లిసి మొత్తం 790 మంది ఎంపీలు ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పాల్గొంటారు. మామూలు ప‌రిస్థితుల్లో అయితే ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా విజ‌యం సాధించాలంటే 396 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే.. రాజ్య‌స‌భ‌లో మూడు.. లోక్ స‌భ‌లో రెండు ఖాళీలు ఉండ‌టంతో మ్యాజిక్ ఫిగ‌ర్ 394కే ప‌రిమిత‌మైంది. త‌న ఓట‌మి ప‌క్కా అని తెలిసి కూడా గోపాల‌కృష్ణ గాంధీ బ‌రిలో నిలిచార‌ని చెప్పాలి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. లోక్ స‌భ‌తో పోలిస్తే.. రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల బ‌ల‌మే ఎక్కువ‌. అయితే.. లోక్ స‌భ‌లో విపక్షాల బ‌లం చాలా ప‌రిమితంగా ఉండ‌టంతో ఎన్డీయే అభ్య‌ర్థి విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కలా మార‌నుంది. ఎన్డీయే కూట‌మితో పాటు.. కూట‌మితో ఏ మాత్రం సంబంధం లేని వైఎస్సార్ కాంగ్రెస్‌.. టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే.. నామినేటెడ్‌.. స్వ‌తంత్రుల ఓట్లు కూడా వెంక‌య్యకు ప‌డ‌నున్నాయి. దీంతో.. వెంక‌య్య‌కు త‌క్కువ‌లో త‌క్కువ 482 ఓట్లు రావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. నామినేటెడ్ ఎంపీల ఓట్ల‌తో వెంక‌య్య‌కు 500 ఓట్ల మార్క్ దాటినా దాటొచ్చ‌న్న అంచ‌నా వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News