గోవా ఎన్నికల వేళ.. బీజేపీకి ఊహించని షాక్..!

Update: 2022-01-11 06:30 GMT
వచ్చే నెలలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఎన్నికల వేళ గోవా రాష్ట్రంలో అధికార బీజేపీకి అనూహ్య రీతిలో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే తాము ప్రతినిధ్యం వహిస్తున్న బీజేపీకి రాజీనామా చేయటం షాకింగ్ గా మారింది.

ప్రస్తుతం నౌకాశ్రయాలు.. వ్యర్థాల నిర్వహణ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న మైఖేల్ లోబో.. బీజేపీకి రాజీనామా చేస్తూ.. ఆ పార్టీ పై విమర్శలు చేశారు. ప్రజల పక్షాన బీజేపీ లేదని.. అందుకే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి మైఖేల్ తో పాటు రాజీనామా చేసిన మరో ఎమ్మెల్యే ప్రవీణ్ సైతం కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్ానరు.

తమ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని.. తాము ఎదుర్కొంటున్న సమస్యకు బీజేపీ సర్కారు పరిష్కారం చూపించకపోవటంతో తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వంలో ఉంటూ.. సరిగ్గా ఎన్నికల వేళ ఈ కొత్త మాటలేంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో జరిగే ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. సర్వే రిపోర్టులు వస్తున్న వేళ.. అందుకు భిన్నంగా రాజీనామాలు చేయటం.. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దం కావటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News