మాతో 'ఉండు' వల్లి : జగన్

Update: 2018-11-24 11:19 GMT
ఉండవల్లి అరుణ్‌ కుమార్. తన వాక్చాతుర్యంతో మనషులను కట్టిపడవేయగల దిట్ట. ఎక్కడ కూడా ఆగకుండా - అనర్గళంగా - తప్పులకు దొరకకుండా మాట్లాడ‌గల వాగ్ధాటి గల మనిషి...ఆయన వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ లో చేరబోతున్నారా...? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.

సమైకాంధ్ర రెండుగా చీలిపోయిన తర్వాత, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో చిత్తుగా ఓడిపోయింది. తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీయేనని ఇక్కడ చెప్పుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు భరోసా ఉంది. కాని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ నాయకులకు మాత్రం ప్రజలలోకి వెళ్లడానికి ఎటువంటి అవకాశం మిగల్చలేదు కాంగ్రెస్ పార్టీ. దీంతో ఉద్దండులైన నాయ‌కులు కూడా మ‌ట్టిక‌రిచి జ‌నాల‌కు దూరంగా బ‌తుకుతున్నారు.  అలాంటి వారిలో ఒక‌రు ఉండ‌వ‌ల్లి.

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ను జగన్ వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. రాజశేఖర రెడ్డి హ‌యాంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు - రాజకీయాలలో సీనియర్ అయిన ఉండవల్లి లాంటి వాళ్లు తమ పార్టీలో ఉంటే - మైలేజ్‌ ఉంటుందని జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ ఆఫర్ ను ఆమోదించారా లేదా అన్నది తెలియలేదు. అయితే వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన స్దానంపై క్లారిటీ వ‌చ్చాక ఉండవల్లి తన నిర్ణయం చెప్పవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2014 ఎన్నికల తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ క్రియాశీల రాజకీయాలలో లేకపోయినప్పటికీ - అప్పుడప్పుడు చంద్రబాబు పై తనదైన శైలిలో చమక్కులు చురుక్కులు విసురుతూనే ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ లో చేరితే ఇది చంద్రబాబుకు పెద్ద నష‌్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికలలో తన వాక్చాతుర్యంతో ప్రజలను ఇట్టే  ఆకట్టుకుంటారని - అంతే కాకుండా అధికార పార్టీని ఎండగట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని విశ్లేషకులు అంటున్నారు. ఉండవల్లి అరుణ్‌ కుమార్ వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ లో చేరితే ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారం రసవత్తంగా ఉంటుందని పలువురు చెవులు కొరుకుంటున్నారు.


Tags:    

Similar News