ఉద్యోగులకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ట్విట్టర్ ..ఏంటంటే !

Update: 2020-05-13 09:10 GMT
ప్రస్తుతం ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవానికి అన్ని రంగాలు కూడా కుదేలైయ్యాయి. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఆర్థికంగా చితికిపోయాయి. ఈ మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచంలోని ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకి వర్క్  ఫ్రం హోం ఇచ్చేసాయి. అయితే , ఇలా ఇంటి నుండి ఉద్యోగులు పని చేయడం ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా కూడా మళ్లీ ఎప్పుడు పూర్తీ స్థాయిలో ఆఫీసులు స్టార్ట్ అవుతాయో చెప్పలేని పరిస్థితి.

ఇలాంటి క్లిష్ట సమయంలో ట్విట్టర్ సంస్థ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.  సోషల్ మీడియా, టెక్‌ దిగ్గజం ట్విటర్‌  తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో  ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్‌ అవతరించింది. ట్విటర్‌ సీఈవో జాక్ డోర్సే మంగళవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి ఈ-మెయిల్‌ ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రిమోట్‌ గా పని చేసుకునే అవకాశమున్న తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసుకోవచ్చని ట్విటర్‌ ప్రకటించింది. సెప్టెంబరుకు ముందు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆఫీసుకు రావాలా వద్దా అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది.

ఈ మహమ్మారిని అడ్డుకోవడనికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు  ట్విటర్‌ హెచ్‌ ఆర్ చీఫ్‌ జెన్నిఫర్‌ క్రైస్ట్‌  వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు. సీఈవో జాక్ డోర్సే 2020 మధ్యలో మూడు నుండి ఆరు నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో దానిని వాయిదా వేసుకున్నారు. మరోవైపు కరోనా, లాక్ ‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్ ‌బుక్‌, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులలో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు  ఇంటినుంచే పని చేయడానికి అనుమతించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News