ట్రంప్ ఇంకో షాక్‌...ఇందులో భార‌త్ వాటా ఎక్కువే

Update: 2020-01-24 03:59 GMT
అవ‌కాశాల స్వ‌ర్గ‌దామంగా పేరొందిన అమెరికా గ‌త కొద్దీ కాలంగా ఆంక్ష‌ల‌కు నిల‌యంగా మారిన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల ష‌ర‌త‌లుతో అధ్య‌క్షుడు ట్రంప్ షాకుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకా రం.. ఆ దేశంలో జన్మించే శిశువులకు జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇప్పటి వరకూ దీని పై అమెరికా లో ఆంక్షలు కూడా లేవు. బర్త్‌ టూరిజం పేరిట ఇది విస్తృత స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. తాజాగా దీనికి ట్రంప్ బ్రేకులు వేశారు.

తమకు పుట్టే పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుండ‌టంతో...ఈ సౌక‌ర్యాన్ని ఆసరాగా చేసుకొని చైనా, రష్యా, భారత్ తదితర దేశాలకు చెందిన మహిళలు ముఖ్యంగా గర్భవతులు అమెరికా లో తమ ప్రసవం జరిగేలా ఆ దేశానికి వెళ్తుంటారు. దీనివల్ల వారికి జన్మించిన శిశువులకు సహజంగానే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీనిపైనే ఆధార పడి అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా నడుస్తున్నాయి. అయితే, ట్రంప్ హయాం లో.. అమెరికాకు వలస వచ్చే వారిపై అనేక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే .. ఆ దేశానికి వెళ్లి పిల్లల్ని కనాలనుకునే మహిళల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు గుమ్మరిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఈ విధంగా.. పిల్లలకు పౌరసత్వం దక్కించుకోవటం కోసమే అమెరికా కు వచ్చే విదేశీ గర్భవతులకు టూరిస్టు వీసాలను అందజేయబోమని స్పష్టం చేసింది.

ఈ మేరకు వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం గురువారం సవరించింది. ఈ నిబంద‌న‌ల ప్ర‌కారం.. కాన్పు కోసమే వచ్చే గర్భవతులకు వీసాలను ఇవ్వరు. ఒకవేళ వైద్య అవసరాల కోసం అమెరికా కు వస్తున్నామని గర్భవతులు దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆ చికిత్సకు అవసరమైన డబ్బులు, అక్కడ ఉన్నన్నాళ్లు అయ్యే వ్యయం భరించే స్థోమత తమకు ఉందని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు నైపుణ్య‌వంతుల‌పై ప‌డిన ట్రంప్ ఫోక‌స్ ఇప్పుడు ఆఖ‌రికి గర్భిణిల‌కు అందించే వీసాల పైనా కూడా ప‌డింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News