మోడీవి ప‌నికిమాలిన మాట‌లు..25వేల ట్వీట్ల‌తో కేటీఆర్ టీం హోరు

Update: 2022-02-10 02:30 GMT
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న ప్ర‌ధాని చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు విరుచుకుప‌డుతుండ‌టం కొన‌సాగుతోంది. టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌ల నుంచి మొద‌లుకొని క్షేత్ర‌స్థాయి నాయ‌కుల వ‌ర‌కు త‌మ‌దైన స్థాయిలో గులాబీ శ్రేణులు ప్ర‌ధానిపై మండిప‌డుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ అయితే త‌మ‌దైన శైలిలో ప్ర‌ధానిపై కామెంట్లు చేశారు. మోడీవి ప‌నికిమాలిన మాట‌లు అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

హైద‌రాబాద్ స‌మీపంలో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ద‌శాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించ‌ప‌రిచేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యాఖ్యానించారు అని కేటీఆర్ ఆగ్ర‌హం వెలిబుచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మోడీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మోడీవి ప‌నికిమాలిన మాట‌లు.. ఇలా మాట్లాడిన ప్ర‌ధాని మ‌రొక‌రు లేరు అని కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ఎనిమిదేళ్ల‌లో తెలంగాణ‌కు ప్ర‌ధాని చేసింది శూన్య‌మ‌ని మండిప‌డ్డారు. విశ్వాసం నింపాల్సిన చోట మోడీ విద్వేషం నింపారని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ‌పై ముందు నుంచే మోడీకి ప‌గ ఉంద‌ని కేటీఆర్ ఆరోపించారు. ``తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌లిపారు. రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ, ఉక్కు ప‌రిశ్ర‌మ‌, ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు ఇవ్వ‌లేదు.`` అని విరుచుకుప‌డ్డారు. దేశంలోని రైతుల‌కు ఇష్టం లేక‌పోయినా న‌ల్ల చ‌ట్టాలు తెచ్చి ర‌ద్దు చేశారని కేటీఆర్ అన్నారు. క‌ర్ణాట‌క‌లో మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నారని విమ‌ర్శించారు. దేశంలో మోడీ రాజ్యాంగం అమ‌లవుతోంద‌ని, ప్ర‌ధాని అన్ని సంస్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారని మండిప‌డ్డారు.

ఇదిలాఉండ‌గా, #ModiEnemyOfTelangana పేరుతో ట్విట్ట‌ర్‌లో హ్యాష్‌టాగ్‌లు పెడుతున్నారు. గంట‌లోపే 25 వేల‌కు పైగా ట్వీట్ల‌ను టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారుల ట్వీట్లు మొద‌టి స్థానంలో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా మోడీ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.
Tags:    

Similar News