తిరుపతి ఉపఎన్నిక : ఏకగ్రీవమా ? ఏకపక్షమా ?

Update: 2020-10-05 07:15 GMT
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసిపి ఏకగ్రీవంగానే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే ఏకపక్షంగా గెలవటమైతే ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఉపఎన్నికలో పోటి చేయటానికి ప్రతిపక్షాలు పెద్దగా ఆసక్తి చూపకపోవటమే ప్రధాన కారణం. మామూలుగా ఎక్కడైనా ఉపఎన్నిక వచ్చిందంటే రాజకీయ పార్టీలు చాలా జోరుమీదుంటాయి. అధికారపార్టీని దెబ్బకొట్టటానికి ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నటం మనం చూస్తున్నదే. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు జనంలో బలం లేదని చాటి చెప్పటానికి అధికారపార్టీ కూడా అన్నీ ప్రయత్నాలు చేస్తుంది.

కానీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో  ప్రత్యేక పరిస్ధితులు కనిపిస్తోంది. అంటే ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించలేదు. అయితే ఏ కారణం వల్ల లోక్ సభ స్ధానం ఖాళీ అయినా ఆరుమాసాల్లో ఉపఎన్నిక నిర్వహించాలన్నది ఎన్నికల నియమావళిలో ఉంది. కాబట్టి ఆరుమాసాల్లో అంటే వచ్చే ఫిబ్రవరిలోగా ఉపఎన్నిక నిర్వహించటం ఖాయమని అందరు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే రాజకీయపార్టీలన్నీ లోలోపల ఉపఎన్నిక విషయంలో కసరత్తులు మొదలుపెట్టేశాయి.

ఇందులో భాగంగానే ఉపఎన్నికలో పోటి చేస్తామని బిజేపి అధ్యక్షుడు సోమువీర్రాజు చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. ఈ విషయం ఇలాగుంటే ఉపఎన్నికలో బీజేపి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయించినట్లు టీడీపీలో ప్రచారం  జరుగుతోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వానికి చంద్రబాబు రాయబారం పంపారట. బీజేపి పోటి చేస్తుందని వీర్రాజు ప్రకటన చేసేశారు కాబట్టి మిత్రపక్షం జనసేన మద్దతు ఇస్తుందనే అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి ఎవరు ఆలోచించటం కూడా లేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉపఎన్నికలో ప్రతిపక్షాలన్నీ కలిసినా వైసిపి గెలుపును ఆపటం కష్టమనే అనుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి గట్టి అభ్యర్ధి లేడు కాబట్టే పోటిలో ఉండకుండా బీజేపికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా ఉప ఎన్నికలో పోటి చేయక పోవటమే మేలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఎలాగూ గెలిచే అవకాశం లేనపుడు అసలు పోటి చేయటం ఎందుకన్నది కొందరి ప్రశ్న.

ఇక రెండో పాయింట్ ఏమిటంటే ఉపఎన్నికలో చంద్రబాబు మద్దతు తీసుకోవటం కూడా చాలామంది కమలనాదులకు ఇష్టం లేదట. పోటికి దూరం గా ఉంటే కాస్త గౌరవంగా ఉంటుందని కొందరు నేతలు వీర్రాజుకు చెప్పారట. వైసిపిని ఢీకొట్టే స్ధాయిలో లేకపోవటం ఒక సమస్య అయితే ఎంపి అనారోగ్యంతో మరణించిన సింపతి ఎలాగూ వైసిపికే ఉంటుంది కాబట్టి పోటి ఆలోచనే అవసరం లేదని వాదిస్తున్నారట. ఒకవేళ పోటీ అంటే జరగాలంటే అదేదో వైసిపి-టీడీపి మధ్యనే జరిగితే సరిపోతుందని కూడా కొందరు నేతలు వీర్రాజుకు చెప్పారట. సో ఈ పరిస్ధితుల్లో తిరుపతి ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందా ? లేకపోతే ఏకపక్షమం అవుతుందా ? అనేది చూడాలి.
Tags:    

Similar News