ఐపీఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చిన ప్రవీణ్ గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది

Update: 2021-07-20 02:30 GMT
చాలామంది ఐపీఎస్ అధికారులకు భిన్నంగా ఉంటుంది సీనియర్ ఐపీఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్ తీరు. సరదాగా.. జోవియల్ గా ఉన్నట్లుగా ఉంటూనే.. ఆయనలోని పోలీస్ అనుక్షణం చుట్టూ గమనిస్తూ ఉంటారు. సింఫుల్ గా చెప్పాలంటే సినిమాల్లో కనిపించే టిపికల్ పోలీస్ హీరో పాత్రకు తగ్గట్లే ఆయన తీరు ఉంటుందని చెబుతారు. ఆయన ఆలోచనలు.. ఆయన పని విధానం.. పలువురితో ఆయన పెట్టుకునే రిలేషన్.. ఆయన భావాలు.. ఆశయాలు అన్ని సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి.

1995 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లుగా ప్రకటించిన ప్రవీణ్ కుమార్.. తన రాజీనామాకు కాస్త ముందుగా ఏం చేశారో తెలుసా?  

యూసఫ్ గూడ బెటాలియన్ లో ఉన్నకొందరు ఆత్మీయుల్ని.. ఐపీఎస్ మిత్రుల్ని కలుసుకొని.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటకు వచ్చి.. ఆ తర్వాత తన వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెల్లడించి సంచలనంగా మారారు. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లో జన్మించిన ఆయన.. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్ లో మాస్టర్స్.. పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ను హార్వర్డ్.. మాసాచుసెట్స్ వర్సిటీల్లో పూర్తి చేశారు.

పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. ఆయన సత్తా ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇవాల్టి రోజున సైబర్ పోలీసింగ్ తో పాటు.. కొత్త తరహా పోలీసు విధి నిర్వహణను డిజైన్ చేసింది ప్రవీణ్ కుమారే కావటం గమనార్హం. సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ సీసీఎస్ లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేసేందుకు ఒక పోలీస్ స్టేషన్ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే.. అందుకు అప్పటి ప్రభుత్వం ఓకే చేశాయి.

అలా సైబర్ పోలీస్ స్టేషన్లు షురూ అయ్యాయి. అంతేకాదు.. హైదరాబాద్ నగర పోలీస్ వెబ్ సైట్.. ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్.. ఆన్ లైన్ పాస్ పోర్టు వెరిఫికేషన్.. ఫారినర్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తదితర వినూత్న కార్యక్రమాలకు ఆయన తెర తీశారు. ప్రవీణ్ కుమార్ మొదలుపెట్టిన సైబర్ పోలీస్ స్టేషన్లకు అనుగుణంగా తర్వాతి కాలంలో సైబరాబాద్.. హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ముంజూరు అయ్యాయి.

పోలీసుల మధ్య ఎస్ఎంఎస్ ల రూపంలో సమాచార మార్పిడికి హోషియార్.. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాల్ని ఆయన డిజైన్ చేసినవే. ఈ రోజున టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ కు రాష్ట్రంలో ఆద్యుడిగా ప్రవీణ్ కుమార్ ను చెప్పాలి. ఇలా తన ఆలోచనతో ఫ్యూచర్ పోలీసింగ్ ఎలా ఉండాలన్న దానికి బీజం వేసింది ఆయనే. పోలీసు శాఖకు చెందిన  ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏరికోరి మరీ గురుకుల సొసైటీకి కార్యదర్శిగా నియమించారు. మరో ఆరేళ్ల సర్వీసు ఉండగానే.. కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టిన ఆయన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News