కేసీఆర్ ఢిల్లీ టూర్..: క్లారిటీ వచ్చింది..!

Update: 2022-05-22 05:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో దేశంలో సంచలనం జరగబోతుందని ప్రకటించారు. కేసీఆర్ ఇలాంటి సంచలనాలను ప్రకటించడం కొత్త కాదు. కానీ ఈసారి కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే దేశ రాజకీయాలవైపు వెళ్లేందుకు కేసీఆర్ రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సంచలనం జరగబోతుందని ప్రకటించడం సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అఖిలేశ్, తదితర నాయకులతో భేటీ అయ్యారు. ఇలా దేశ రాజకీయ నాయకులతో కలవడం చర్చనీయాంశంగా మారింది.  గతంలో మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించి విఫలమైన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారా..? అనే చర్చ సాగుతోంది.

తెలంగాణ వేదికగా కేసీఆర్ కొన్ని నెలలుగా కేంద్రంపై విపరీతంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రానిదే తప్పని రైతులకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చివరికి కేంద్రం వెనుకడుగు వేయకపోవడంతో కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. అంతకుముందే మూడో ఫ్రంట్ కోసం మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి వాళ్లను కలిశారు. ఆ తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను కలిశారు. దీంతో మూడో ప్రత్యామ్నాయానికి బీజం పడిందని అనుకున్నారు. కానీ స్టాలిన్, ఉద్దవ్ థాక్రేలు కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదని తేల్చారు. దీంతో 'మూడో'ప్రయత్నాలు మానుకున్నారు. కొంతకాలం మీడియా ఎదుటకు రాని కేసీఆర్ వచ్చీ రాగానే ఢిల్లీకి పయనమయ్యారు.

ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయ్యారు. వీరిద్దరు మూడో ఫ్రంట్ ను వ్యతిరేకంచారు. దీంతో వీరితో భేటీ అవ్వడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చేందుకేనని అంటున్నారు. కేంద్రంతో ఏ విషయంలోనూ గెలవలేకపోతున్న కేసీఆర్ కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లోనైనా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి ఆటంకం లేదు. వైసీపీ, బీజేడీ లాంటి సపోర్టు గట్టిగా ఉంది. వీళ్లు ప్రస్తుతం కేసీఆర్ మాట వినే పరిస్థితిలో లేదు. అయితే పొరుగు రాష్ట్రం జగన్ కనుక యూటర్న్ తీసుకుంటే బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఏపీ సీఎం జగన్ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకునే కేసీఆర్ విన్నవుతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ బీజేపీని వీడే పరిస్థితిల లేదు. కానీ కేసీఆర్ మాత్రం మిగతా పార్టీల మద్దతు కూడగట్టి చివరికి జగన్ ను సంప్రదిస్తారని అంటున్నారు. మరి కేసీఆర్ ప్రయత్నం చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News