సుప్రీంలో సీబీఐకి షాక్.. దీదీ దీక్ష విర‌మిస్తారా?

Update: 2019-02-04 07:44 GMT
సుప్రీంలో సీబీఐకి షాక్ త‌గిలింది. దేశంలో ఎక్క‌డైనా స‌రే.. స‌రైన ప‌త్రాలు ఉన్నాయా?  లేదా? అన్న‌వి ఏమీ చూపించ‌కుండానే త‌నిఖీల‌కు.. విచార‌ణ‌కు వెళ్లే అధికారుల అత్యుత్సాహానికి బ్రేకులు వేసేలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కోల్ క‌తా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల్నికోల్ క‌తా పోలీసులు అడ్డుకోవ‌టం.. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్ల‌టం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. త‌మ అధికారుల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన‌ట్లుగా పేర్కొంది. కోల్ క‌తా న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్  రాజీవ్ కుమార్ సీబీఐకి లొంగిపోయేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. మ‌రోవైపు ఇదే అంశం స‌రికాదంటూ ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రోడ్డు మీద‌న ఆదివారం రాత్రి నుంచి నిర‌స‌న దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సీబీఐ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపేందుకు సుప్రీం ధ‌ర్మాస‌నం ఒప్పుకోలేదు. త‌క్ష‌ణ‌మే విచార‌ణ చేప‌ట్టాల‌న్న సీబీఐ అభ్య‌ర్థ‌న స‌రికాదంటూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌న్ గొగోయ్ తోసిపుచ్చారు. సీబీఐ అధికారుల‌పై కోల్ క‌తా పోలీసులు అరెస్ట్ చేసిన పిటిష‌న్ పై విచార‌ణ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు.

సీబీఐ అధికారుల్ని అన్యాయంగా అరెస్ట్ చేశార‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు నివేదించ‌గా.. దానికి సాక్ష్యాలు చూపించాలంటూ కోర్టు ఆదేశించింది. దీనికి సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం సీబీఐ నుంచి రాలేద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ పిటిష‌న్ పై విచార‌ణ‌ను మంగ‌ళ‌వారం నాటికి సుప్రీం వాయిదా వేసింది. దీంతో.. దీదీ స‌ర్కారు తీరుపై ఉడికిపోతున్న సీబీఐకి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లైంది. కుట్ర పూరితంగా.. క‌క్ష సాధింపు చ‌ర్య‌లో భాగంగానే  సీబీఐ త‌మ పోలీసు ఉన్న‌తాధికారిని వేధింపుల‌కు గురి చేస్తుందంటూ నిర‌స‌న చేస్తున్న దీదీ.. సుప్రీం నిర్ణ‌యంతో త‌న నిర‌స‌న‌ను విర‌మిస్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.  
    

Tags:    

Similar News