అయోధ్య రామాలయ భూముల ఎపిసోడ్ లో షాకింగ్ స్కాం

Update: 2021-06-24 03:30 GMT
బీజేపీ అన్నంతనే గుర్తుకు వచ్చేది అయోధ్యలోని రామాలయ డిమాండ్. అలాంటి పార్టీలో ఆ ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని అమ్మే విషయంలో చేసిన తప్పుల లెక్కలు బయటకు వస్తున్నాయి. తమను తాము సుద్దపూసలుగా.. స్కాంలు అన్నవి తమ పార్టీలో కనిపించవని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు.. అయోధ్య రాయాలయ భూముల విషయంలో బయటకు వస్తున్న అంశాలకు సిగ్గుపడాల్సిందే.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. దేవుడి దగ్గరకు వచ్చేసరికి.. దుర్మార్గాలకు పాల్పడటానికి చాలామంది భయపడతారు. తాజాగా బయటకు వస్తున్న పరిణామాలు చూస్తే.. బీజేపీ నేతల్లోని కొందరికి అలాంటివేమీ ఉన్నట్లు కనిపించవు. అయోధ్య రామాలయ నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే బయటకు వచ్చి సంచలనంగా మారింది.

ప్రభుత్వ భూమిని కౌలుకు ఇస్తే.. వారి నుంచి బలవంతంగా బీజేపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేయటమే కాదు.. దాన్ని పెద్ద మొత్తానికి ట్రస్టుకే అమ్మేయటం విశేషం. మరీ ఇంత ఆరాచకమా? అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. బీజేపీకి చెందిన అయోధ్య నగర మేయరర్ రిషీకేశ్ ఉపాధ్యాయ్ కు బంధువు దీప్ నారాయణ. రామజన్మభూమికి పక్కనే ఉన్న 890 చదరపు మీటర్ల భూమిని ఇతగాడు కొనుగోలు చేశాడు. దానిని మేలో ట్రస్టుకు రూ.2.5కోట్లకు అమ్మేశాడు.

ట్విస్టు ఏమంటే.. దీప్ నారాయణ్ అమ్మిన భూమి ప్రభుత్వానిదే కావటం గమనార్హం. ఈ విషయం తెలిసినంతనే ట్రస్టు సభ్యుడైన జిల్లా కలెక్టర్ అనూప్ కుమార్ ఝూ అంతర్గత విచారణకు ఆదేశించారు. తనిఖీ చేసిన అధికారులు ఆ భూమి ప్రభుత్వానిదేనని తేల్చారు. వాస్తవానికి ఆ భూమిని మహంత విశ్వనాథ్ ప్రసాదాచార్యకు కౌలుకు ఇచ్చారు. ఆయనకు వ్యవసాయం చేసుకునే హక్కు తప్పించి.. యాజమాన్య హక్కు లేదని గుర్తించారు. ప్రభుత్వ భూమిని అమ్మి.. మరోసారి ఆ భూమిని రామాలయ ట్రస్టుకు అమ్మేయటం ద్వారా కోట్లను కొల్లగొట్టేశారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News