శశికళ చుట్టూ మళ్లీ కుట్రలు.. విడుదలపై మౌనం

Update: 2020-09-25 14:00 GMT
జయలలిత, కరుణానిధిల మరణంతో తమిళ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేయాలని జయలలిత స్నేహితురాలు శశికళ రాగా.. బీజేపీ దెబ్బకు జైలు పాలైంది. అయితే ఆమె విడుదలకు వేళైంది. దీంతో మళ్లీ తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడడంతో హాట్ హాట్ వాతావరణం నెలకొంది.

శశికళ విడుదల ఎప్పుడూ అనేది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. దీంతో కొందరు ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై సమాచార హక్కుచట్టాన్ని ఆశ్రయించారు. రూ.10 కోట్లు చెల్లిస్తే శశికళను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేస్తామని వార్తలు వచ్చాయి. 10 కోట్ల పెద్ద లెక్కకాకపోవడంతో వచ్చే ఏడాది చిన్నమ్మ విడుదల ఖాయంగానే కనిపిస్తోంది.

అయితే శశికళను జైలు నుంచి విడుదల కాకుండా.. మళ్లీ జైలుకు పంపేలా ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారట.. ఆమెకు సంబంధించిన కేసులను తవ్వితీసి కోర్టులకు ఎక్కేందుకురెడీ అయ్యారట.. ఈ పరిణామాలపై శశికళ ఆందోళనగా ఉన్నట్టు సమాచారం.అందుకే తన విడుదలపై గోప్యం పాటించాలని ఆమె అందరినీ కోరుతోందట..

ఈ క్రమంలోనే తన గురించిన ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. తన విడుదల గురించి ఎవరు ఏ సమాచారాన్ని అడిగినా  ఇవ్వవద్దని ఆమె కర్ణాటక జైలు అధికారులకు లేఖ రాసినట్టు తెలిసింది.

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే-బీజేపీని శశికళ తప్పితే ఎవరూ గట్టెక్కించలేరనే టాక్ నడుస్తోంది. ఆమెను బీజేపీ చేరదీసి మళ్లీ అన్నాడీఎంకేలో యాక్టివ్ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు శశికళ మేనల్లుడు దినకరణ్ తో బీజేపీ చర్చలు జరుపుతున్నట్టు టాక్. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళకు.. దినకరణ్ కు ప్రభుత్వ పదవి దక్కేలా ఒప్పందం జరిగిందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ-అన్నాడీఎంకేలతో శశికళ పనిచేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News