బాయ్‌ఫ్రెండ్‌ కోసమే ...మరో యువతి నాటకం బట్టబయలు !

Update: 2021-08-19 09:30 GMT
హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన సంతోష్‌ నగర్‌ యువతి గ్యాంగ్ రేప్‌ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. యువతి పై అత్యాచారం జరగలేదని, తనను కాదని మరో వివాహం చేసుకుంటున్న బాయ్‌ ఫ్రెండ్‌ ను కేసులో ఇరికించేందుకు ఆమె నాటకం ఆడిందని తేల్చేశారు. అసలే గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్ల పై గ్యాంగ్ రేప్ ఘటన తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్‌ పోలీసులను సంతోష్‌ నగర్ ఘటన మరింత ఉలికిపాటుకు గురిచేసింది.

దీంతో ఈ కేసు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక టీమ్‌ లు ఏర్పాటు చేసి 24 గంటల్లోనే చేధించారు. తనను కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ల్యాబ్ టెక్నీషియన్‌ గా పనిచేస్తున్న యువతి బుధవారం సంతోష్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేను ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌ లో ల్యాబ్ టెక్నీషియన్‌ గా మూడు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాను. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ప్యాసింజర్ ఆటో ఎక్కాను. నాతో పాటు ఆటో ఎక్కిన మహిళ మిథాని డిపో వద్ద దిగిపోయింది. నాకు అంతలోనే నిద్రపట్టగా, మెలకువ వచ్చేసరికి ఆటో షాహినగర్‌ లో ఉంది. అప్పటికి ఆటోలో నాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను పహాడీషరీఫ్‌ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హింసించి గ్యాంగ్‌ రేప్ చేశారు అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచింది.

దీంతో సంతోష్‌ నగర్ పోలీసులు ఐపీసీ 363, 376(డి), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక టీమ్‌ లు ఏర్పాటు చేశారు. యాదగిరి థియేటర్‌ నుంచి పహాడీషరీఫ్‌ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఒక్క క్లూ కూడా లభించలేదు. బాధితురాలి ఫిర్యాదుకు సీన్ ఆఫ్ అఫెన్స్‌ కు ఎక్కడా పొంతన కుదరలేదు. యువతి ఇంటి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ 2కిలోమీటర్లు కూడా లేదని, అలాంటిది ఆమె యాదగిరి థియేటర్‌ వరకు వచ్చి ఆటో ఎందుకు ఎక్కిందని పోలీసులు సందేహించారు.

నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో రాత్రి 9 గంటల సమయంలో ఆమెను కిడ్నాప్ చేయడం సాధ్యమా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో యువతిపై అనుమానం పెంచుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఆ వైద్య పరీక్షల్లో యువతి రేప్‌ కు గురి కాలేదని నిర్ధారణ అయినట్టు సమాచారం.తాను ప్రేమించిన వ్యక్తికి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని, ఆ కక్షతోనే అతడిని కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు ఒప్పుకుంది. మొత్తం మీద పోలీసులు ఫిర్యాదు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే నిజాన్ని వెలికి తీశారు. దీంతో నగరంలో ఇలాంటి కేసులపై అప్రమత్తంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు పోలీసులు, కాగా గత కొద్ది రోజుల క్రితం కూడా ఘట్‌కేసర్‌లో ఓ యువతికూడా ఇలాగే నాటకమాడడంతో పోలీసులు నిజాన్ని చేధించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News