ఇసుక సామాన్యుడికి చేరువగా.. వినియోగదారులకు బాసటగా ఏపీ ప్రభుత్వం

Update: 2020-07-17 06:00 GMT
వినియోగదారుల మేలు కోసం.. అవసరమైన వారికే ఇసుక అందాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విధానంలో కీలక మార్పులు చేసింది. ఇసుక కొరత రానీయకూడదని ప్రభుత్వం అన్ని వర్గాల అవసరాలకూ ఇసుక ఉచితంగా అందివ్వాలన్న నిర్ణయానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇది శుక్రవారం నుంచి అమలులోకి రానుంది.

ఈ సరికొత్త ఇసుక విధానం ఇలా ఉంది. జిల్లాల్లో 80 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇవన్నీ 1 నుంచి 3 స్ట్రీమ్స్‌గానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం 34 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇప్పటివరకు ట్రాక్టర్‌తో ఇసుక తరలించాలంటే ప్రభుత్వానికి రూ.1,300 చలానా కట్టాల్సి వచ్చేది. ట్రాక్టర్లతో ఇసుక రవాణాకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని తేల్చడంతో భారీగా ధర తగ్గనుంది. ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుకకు చలానాగా రూ.1,300, లోడింగ్‌ చార్జీలు రూ.800, రవాణా చార్జీ రూ.వెయ్యి నుంచి 1,500.. ఇవన్నీ కలిపి మొత్తం రూ.3,500 నుంచి 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇకపై చలానా ధర తగ్గడంతో వినియోగదారునికి వెసులుబాటు కలగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

- వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్‌–1లో ఇసుక కోసం దరఖాస్తు చేయాలి. 24 గంటల్లో అర్జీని పరిశీలించి అనెక్సర్‌–2లో పర్మిట్‌ను సమయం, తేదీలతో ఇస్తారు. ఇసుకను రీచ్‌ నుంచి 20 కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.  

- ఇసుక రవాణా సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్‌ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలి.

-గ్రామ కార్యదర్శి ఇసుక పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలి. 1 నుంచి 3 స్ట్రీమ్స్‌లో ఇసుక లభ్యత లేకుంటే కలెక్టర్‌ 4, 5 స్ట్రీమ్స్‌ నుంచి ఇసుక తెప్పించి స్టాక్‌ యార్డుల ద్వారా సరఫరా చేస్తారు.  
 
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న పలు రీచ్‌లలో ట్రాక్టర్‌ లోడింగ్‌కు రూ.800 నుంచి వెయ్యి వసూ లు చేస్తున్నారు. గతంలో లోడింగ్‌ చార్జీలు రూ.400 ఉండేది. ఇసుకకు డిమాండ్‌ పెరగటంతో లోడింగ్‌ చార్జీలు కూడా పెంచేశారు. దీని భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకా రం లోడింగ్‌కు టన్నుకు రూ.90 చొప్పున ట్రాక్టర్‌ (4.5 టన్నులు)కు రూ.405 తీసుకోవాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1,300 భారం తగ్గింది.
Tags:    

Similar News